వేములవాడ, డిసెంబర్ 14: ‘గెలిచినా ఓడినా ప్రజల మధ్యలోనే ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. కష్టాల్లో తోడుంటా. దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో పాలుపంచుకుందాం’ అని వేములవాడ బీఆర్ఎస్ నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు భరోసానిచ్చారు. గురువారం వేములవాడలోని ఆయన నివాసంలో నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా, హాజరై మాట్లాడారు. ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమేనని, నా కోసం అహర్నిశలూ పనిచేసిన కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు.
దీటైన ప్రతిపక్షంగా ప్రజా సమస్యల్లో ఎప్పటికప్పుడు పాలుపంచుకొని ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధంగా ఉందామని పిలుపునిచ్చారు. పదమూడేండ్లుగా రాష్ట్ర సాధనే ధ్యేయంగా కొట్లాడి తెచ్చిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసిన మనమందరం మళ్లీ ప్రజల పక్షాన పని చేద్దామన్నారు. గెలుపోటములతో పనిలేదని వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు.
మాదంతా బీఆర్ఎస్ కుటుంబమని, ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో కీలకంగా వ్యవహరిస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి, వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచిన ఆది శ్రీనివాస్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటుదామని చెప్పారు. పార్టీ కోసం నిజాయితీగా పని చేసేవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, వెన్నుపోటు దారులు ఎవరైనా ఉంటే వారితోనే ప్రమాదమని చెప్పారు. సమావేశంలో జడ్పీచైర్పర్సన్ న్యాలకొండ అరు ణ,
మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, జగిత్యాల జడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్రావు, ఎంపీపీలు బండ మల్లేశం యాదవ్, చంద్రయ్య గౌడ్, గంగం స్వరూపారాణి, రేవతి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, నాగం భూమయ్య, పార్టీ సీనియర్ నాయకులు లోక బాపురెడ్డి, ఏనుగు మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, తీగల రవీందర్ గౌడ్, సెస్ డైరెక్టర్లు రేగులపాటి హరిచరణ్ రావు, ఆకుల దేవరాజు, పొన్నాల శ్రీనివాసరావు, ఆకుల గంగరాజం, పార్టీ అధ్యక్షులు గోసుల రవి, మల్యాల దేవయ్య, గంగ ప్రసాద్, సత్తిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు సల్మాన్ రెడ్డి, రామ్మోహన్ రావు, కిషన్ రావు, తిప్పని శ్రీనివాస్ పాల్గొన్నారు.