జిల్లాలోని బీఆర్ఎస్ అభ్యర్థులు గురువారం నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్.. ధర్మపురి నృసింహుడి క్షేత్రంలో పూజలు చేసిన అనంతరం అట్టహాసంగా నామినేషన్ వేశారు. జగిత్యాల అభ్యర్థి డాక్టర్ మాకునూరి సంజయ్కుమార్ అంబారిపేట వేంకటేశ్వరస్వామి, మార్కండేయ ఆలయాల్లో పూజలు చేసిన అనంతరం పండుగ వాతావరణంలో పత్రాలు సమర్పించారు. ఆ తర్వాత వేలాది మందితో భారీ ర్యాలీ తీశారు. జిల్లా పరిధిలోని చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రెండోసారి నామినేషన్ వేయగా, వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు రెండు సెట్లు దాఖలు చేశారు. ఆయాచోట్ల అభ్యర్థులు మాట్లాడుతూ, మీ బిడ్డగా.. మీ మధ్యన ఉన్న తమను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మీకు పాలకుడిగా కాకుండా.. సేవకుడిగా పనిచేస్తామని, నియోజకవర్గాలను మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
జగిత్యాల, నవంబర్9: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నా రు. ఈ నెల 3వ తేదీనే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా, మంచి రోజు కోసం వేచి చూశా రు. అందుకే మొదటి నాలుగు రోజులు అంతంతమాత్రమే రాగా, బుధ, గురువారాల్లో మంచి స్పందన వచ్చింది. బుధవారం 22 మంది, గురువారం 24 మంది దాఖలు చేశారు. జగిత్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలుండగా, కోరుట్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల బుధవారమే దాఖలు చేశారు. గురువారం జగిత్యాల నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్, బీజేపీ, అభ్యర్థులతో పాటు మరో ఆరుగురు అభ్యర్థులు దాఖలు చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర పార్టీలు, స్వతంత్రులు మరో ఏడుగురు నామినేషన్లను వేశారు. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు జగిత్యాల నియోజకవర్గంలో 23 , కోరుట్లలో 16, ధర్మపురిలో 18 నామినేషన్లను దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. కాగా, జిల్లా పరిధిలోకి వచ్చే చొప్పదండి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా సుంకె రవిశంకర్ గురువారం రెండో సెట్ దాఖలు చేశారు. వేములవాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చల్మెడ లక్ష్మీనర్సింహారావు రెండు సెట్లు దాఖలు చేశారు.