కార్పొరేషన్/కొత్తపల్లి ఏప్రిల్ 1: కరీంనగర్కు పూర్వం ఎలగందుల జిల్లా కేంద్రంగా కొనసాగిందని, ఎంతో చరిత్ర కలిగిన ఎలగందుల గ్రామానికి పూర్వవైభవం తెచ్చి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. కరీంనగర్, ఎలగందల్ పాత రోడ్డు పునరుద్ధరణ పనులను మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం మంత్రి కరీంనగర్ నగరంలో సాగుతున్న పలు పనులను, సదాశివపల్లి చౌరస్తా, కేబుల్ బ్రిడ్జి వద్ద చేపట్టనున్న చౌరస్తా అభివృద్ధి పనులు, అప్రోచ్ రోడ్డు పనులను, ఎన్టీఆర్ చౌరస్తాలో సాగుతున్న డ్రైనేజీ, ట్రాపిక్ లైట్ల పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయా చోట్ల మంత్రి మాట్లాడుతూ, నగరంలో చేపడుతున్న అభివృద్ధ్ది పనులన్నింటిని నిర్ధేశించిన లక్ష్యంలోగా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ నుంచి ఎలగందల్ వరకు పాతరోడ్డులో ఎల్ఎండీపై 600 మీటర్ల మేరకు బ్రిడ్జి, కెనాల్పై 60 మీటర్ల బ్రిడ్జితోపాటు 750 మీటర్ల అప్రోచ్ రోడ్డును నిర్మిస్తున్నామని తెలిపారు. సమైక్య పాలనలో మసకబారిన ఎలగందల్కు మళ్లీ గుర్తింపు తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పనులు పూర్తయితే కరీంనగర్ నుంచి సిరిసిల్లకు దూరం 8 కిలోమీటర్ల తగ్గుతుందన్నారు. బ్రిడ్జికి ఇరువైపులా నీరు ఉండి ఆహ్లాదకరమైన వాతావరణంతో టాంక్బండ్ తరహాలో ఈ ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎలగందల్ ఖిల్లా చరిత్రను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఈ నెల 14న కేబుల్ బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంగానే పనులు చేపడుతున్నామన్నారు. దీనిలో ఇప్పటికే అప్రోచ్రోడ్డు పనులు, డైనమిక్ లైటింగ్ పనులు కూడా తుదిదశకు వచ్చాయన్నారు. వీటిని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జిపై లైటింగ్ పనులు పూర్తయితే ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తామన్నారు. ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. డ్రైనేజీ పనులను సత్వరమే చేపట్టాలన్నారు. ఈ వేసవి కాలంలో ఈ పనులన్నింటినీ పూర్తి చేసి వానకాలంలో ఎంత వరద వచ్చిన రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రికి భారీ స్వాగతం పలికారు. బావుపేట నుంచి ఎలగందల్ వరకు వాహనాల భారీర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ వై సునీల్రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.