కలెక్టరేట్, ఏప్రిల్ 5: దేశ ప్రజల సంక్షేమమే శ్రేయస్సుగా భావించి, వారి అభ్యున్నతి కోసం అనుక్షణం పాటుపడ్డ మహనీయుల సేవలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ 116వ జయంతి వేడుకలను బుధవారం నగరంలోని మంచిర్యాల చౌరస్తాలో ఆయన విగ్రహం ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. దేశ ప్రజల ఆశాజ్యోతులుగా విరాజిల్లుతున్న జగ్జీవన్రామ్, అంబేద్కర్ కేవలం కొన్ని వర్గాలకే పరిమితం కాదని, దేశ ప్రజల ఉమ్మడి ఆస్తి అని అన్నారు. వారి ఆశయాల సాధనతోనే దేశంలోని దళితజాతి అభ్యున్నతి జరుగుతుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే, దాన్ని అమలు చేయడంలో కేంద్ర మంత్రిగా ఉంటూ బాబూ జగ్జీవన్రామ్ ఎంతో కృషి చేశారన్నారు.
దేశంలో వ్యవసాయ సంస్కరణలు తెచ్చిన ఘనత జగ్జీవన్రామ్దేనని, ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ సరికొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ, దళితులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్నాడని కొనియాడారు. కార్మికుల కోసం అనేక చట్టాలు రూపొందించి, విజయవంతంగా అమలు చేసి, వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి జగ్జీవన్రామ్ అని కొనియాడారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఉమ్మడి పాలనలో మహనీయుల సమావేశాలు సుదీర్ఘంగా జరుపుకోలేదని, నేడు ప్రశాంత వాతావరణంలో మనీయుల జయంతి వేడుకలు కొనసాగుతున్నాయన్నారు.
ఏడున్నర దశాబ్ధాలుగా వెనుకబాటుకు గురవుతున్న దళితులు ఆర్ధికాభివృద్ధి సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకం ప్రారంభించిందని వెల్లడించారు. త్వరలోనే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపిక చేసే 1100 మందికి కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించారు. మహనీయుల సేవలు నిరంతరం గుర్తుకు తెచ్చేలా రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని హైదారాబాద్ నగరం నడి బొడ్డున ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టేందుకు మనసొప్పడం లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై నిరంతరం దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో దళితుల అభివృద్ధి కోసం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. మానేరు నదిపై నిర్మిస్తున్న రివర్ ఫ్రంట్లో బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈనెల 14న రాజధానిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్రామ్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్రామ్ మాత్రమేనని పేర్కొన్నారు. సీపీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, దేశంలో హరిత విప్లవానికి బీజం వేసిన రాజకీయవేత్త జగ్జీవన్రామ్ మాత్రమేనన్నారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ, బడుగుల అభ్యున్నతి కోసం తనవంతు కృషి చేశారని కొనియాడారు. సభాధ్యక్షత వహించిన సముద్రాల అజయ్ మాట్లాడుతూ, దళితుల్లో వైషమ్యాలు పెంచి పోషించి, వారిని చీల్చి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ, అనుబంధ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నదన్నారు. ఉత్తర భారతంలో చేస్తున్న ఆగడాలు, దక్షిణాదిలో కూడా చేసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటుండడం అభినందనీయమన్నారు.
బీజేపీ అరాచకాలను దళితులంతా కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అంతకుముందు బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి మంత్రి గంగులతో పాటు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, బీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి బస్వరాజు సారయ్య, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, కార్పొరేటర్లు కంసాల శ్రీనివాస్, మేచినేని వనజ-అశోక్రావు, అర్శ కిరణ్మయి-మల్లేశం, గంట కళ్యాణి-శ్రీనివాస్, జయంతి సభ వర్కింగ్ అధ్యక్షురాలు గంటల రేణుక, దళిత సంఘాల నాయకులు మేడి అంజయ్య, కామారపు శ్యామ్, మేడి మహేశ్, తదితరులు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం జయంత్యుత్సవ సమావేశానికి హాజరైన ప్రజలకు మంత్రి భోజనం వడ్డించారు.