కమాన్చౌరస్తా, మార్చి 15: ప్రజల గుండెలోతుల్లోకి వెళ్లిన సినిమా బలగం అని, ఈ నేపథ్యంలో ఆదరించిన ప్రేక్షకుల మధ్య చిత్రం యూనిట్ సభ్యులను సన్మానించు కుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని జ్యోతిబాఫూలే మైదానంలో బుధవారం రాత్రి బలగం సక్సెస్ మీట్ను మంత్రి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చిత్ర నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్రెడ్డి, హనీ, దర్శకుడు ఎల్దండి వేణు, హీరో ప్రియదర్శి, హీరోయిన్ కావ్య తదితరులు హాజరై సందడి చేశారు. సినిమాలోని పలు సన్నివేశాలను కండ్లకు కట్టేలా వివరించారు. చిత్రం విజయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పల్లెల యదార్థ గాథను అద్భుతంగా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఈ భూమిమీద ఎవరూ శాశ్వతం కాదని, అంతిమంగా తమ కుటుంబాలకు ప్రేమ పంచాలని చూపించిన సినిమా బలగం అని అన్నారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ప్రేక్షకులే తమ బలగం అన్నారు. మేం నిర్వహించుకునే కార్యక్రమాలకు భిన్నంగా, మంత్రి, ప్రేక్షకులు మమ్మల్ని పిలిచి సక్సెస్ మీట్ నిర్వహించడం గొప్పగా భావిస్తున్నామన్నారు. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, తాను చాలా రోజుల తర్వాత చూసిన మంచి సినిమా బలగం అన్నారు.
దర్శకుడు ఎల్దండి వేణు సిరిసిల్లలో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు. కరీంనగర్తో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. బలగం చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు భీమ్స్, గేయ రచయిత దాసర్ల శ్యామ్, నటీనటులు రచ్చరవి, విజయలక్ష్మి, మల్లయ్య, సౌమ్య, సత్యనారాయణ, సంజయ్, శ్రీకాంత్, సు ధాకర్ రెడ్డి, మురళీధర్ సందడి చేశారు. కార్యక్రమంలో మేయర్ సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణీహరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.