తెలంగాణచౌక్, ఫిబ్రవరి 9: నగునూర్లోని ప్రతిమ మెడికల్ కాలేజీలో శ్వాసకోశ, ఛాతి, సంబంధిత వ్యాధులపై ఈ నెల 11, 12 తేదీల్లో రెండో రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ చెస్ట్ అసోసియేషన్ సభ్యుడు డాక్టర్ రవీందర్ రెడ్డి, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ వినయ్కుమార్ తెలిపారు. టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్ చెస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్లోని ప్రెస్ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఈ సదస్సులో దేశంలోని 500 మంది ప్రముఖ శ్వాసకోశ, ఛాతి వైద్య నిపుణులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. వైద్య వృత్తిలో పీజీ చేస్తున్న విద్యార్థులు, వైద్యులకు శ్వాసకోశ, ఛాతి వ్యాధులపై అవగాహన కల్పించమే కాకుండా నూతన మార్పులు, ఆధునిక వైద్య పరిజ్ఞానం, అనుభవాలను 100 మంది వైద్య నిపుణులు తమ ప్రసంగాల ద్వారా వివరిస్తారని తెలిపారు. అనంతరం సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుమన్కుమార్, రాములు పాల్గొన్నారు.