కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 3 : కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖాధికారులు తీరు మార్చుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ వరంగల్ డివిజన్ కమిషనర్ శ్రీకాంత్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ పరిశీలనలో భాగంగా మంగళవారం కరీంనగర్కు వచ్చిన ఆయన రామగుండం సమీపంలో గోలివాడ సమ్మక్క-సారలమ్మ గద్దెలను పరిశీలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం వేళలో జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన స్థానిక ఏసీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. అనంతరం, అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆలయాలకు సంబంధించి వ్యవస్థాపక ధర్మకర్తలు, దాతలు, నిర్వాహకులు, పాలకమండళ్లతో ఆదాయం ఉన్నా పలువురు అధికారుల తీరుతో అభివృద్ధికి నోచుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే, సంవత్సరాలుగా జిల్లా కేంద్రంలో ఏసీ కార్యాలయం ఉన్నప్పటికీ ఇక్కడ సరైన సమాచారం, ఆలయాలకు సంబంధించిన వివరాలు అందుబాటులో లేకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఆలయ భూముల విషయంలో పలుసార్లు అధికారులతో సమావేశాలు నిర్వహించినప్పటికీ, డీసీ కార్యాలయం, కమిషనరేట్ నుంచి వచ్చే లేఖలకు సరైన సమాధానం ఉండడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్యాయంలో ఫైళ్ల నిర్వహణ సరిగా లేదని, ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బదిలీలు తప్పవని హెచ్చరించారు. ఈ నెలాఖరులో తిరిగి కార్యాలయాన్ని పరిశీలిస్తానని, అప్పటివరకు ఫైళ్లను సరిచేయాలని అధికారులకు చెప్పారు. ఆ తర్వాత జోనల్ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చిన పలువురు ఈవోలకు సూచనలు చేశారు.
రేకుర్తి సమ్మక్క గద్దెల పరిశీలన
బుధవారం ఉదయం డీసీ శ్రీకాంత్ రావు రేకుర్తిలోని సమ్మక్క-సారలమ్మ గద్దెలను పరిశీలించారు. జాతర సందర్భంగా టెండర్లు, జాతర నిర్వహణ పలు విషయాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం ఆయన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి బయలుదేరి వెళ్లారు.