పెగడపల్లి, మార్చి 18: రైతుల సంక్షేమానికి మార్కెట్ కమిటీలు కృషి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పెగడపల్లి మార్కెట్ కమిటీ గోదాములో శనివారం నిర్వహించిన వ్యవసాయ మార్కె ట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మార్కెట్ కమిటీలు అలంకార ప్రాయం గా ఉండకుండా, రైతుల కు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పాటుపడాలని సూచించారు. మంత్రి ఈశ్వర్ సమక్షంలో జిల్లా మార్కెట్ అధికారి ప్రకాశ్ ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్ లోక నిర్మల-మల్లారెడ్డి, వైస్ చైర్మన్ రాజు ఆంజనేయు లు, డైరెక్టర్లు మంత్రి వేణుగోపాల్, మేర్గు శ్రీనివాస్, ఏడుమ్యాకల పద్మ, ఇటిక్యాల కిరణ్, పలుమారు విజయ్యాదవ్, అజ్మీరా భూమానాయక్, తడగొండ సాగర్, చెట్ల శ్రీనివాస్, పన్నాటి లావణ్య-గంగాధర్, మడిగెల తిరుపతి, ఈరి కనకయ్య, ముదుగంటి గోపాల్రెడ్డి, నునుగొండ మోహన్, వెల్మ సత్యనారాయణరెడ్డితో ప్రమాణ స్వీకారం చేశారు.
అంతకముందు రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కల్యాణ మండపం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయగా, ఒరుగల రాజేశం వ్యవసాయ క్షేత్రంలో మంత్రి ఆయిల్పామ్ మొక్కను నాటారు. అలాగే బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బోగ లక్ష్మీనారాయణ-శారద నూతన గృహప్రవేశం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.