ఫర్టిలైజర్సిటీ, నవంబర్ 27: మంత్రాలు, చేతబడులు చేస్తామని, ఇంకా గుప్త నిధులు వెలికి తీస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ముఠాను గోదావరిఖని వన్టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఠాణా ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ వివరాలు వెల్లండించారు. కొత్తగూడానికి చెందిన అప్పాళ లక్ష్మన్ గోదావరిఖని తిలక్నగర్లోని బంధువు లీలామ్దేవి ఇంట్లో ఉంటున్నాడు. అప్పాల లక్ష్మణ్ 25 ఏండ్ల కింద పరకాలకు చెందిన పూతల వీరయ్య వద్ద కనికట్టు విద్యలు, పూజలు నేర్చుకున్నాడు.
మూడ నమ్మకాలను ఆసరాగా చేసుకోని ప్రజలను మోసం చేస్తూ డబ్బులు తీసుకునేవాడు. ఆ డబ్బు సరిపోక గోదావరిఖని తిలక్నగర్లో ఉన్న బంధువు చిన్నమ్మ కొడుకు పాండు రాజు, రాజుకు పరిచయం ఉన్న గంగారపు వినయ్ కుమార్, వాసం రాజేశ్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు. పథకం ప్రకారం ఎవరికి ఏ వ్యాధులు ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా ఎలగందుల బావుపేటకు చెందిన తిరుపతి అనే వ్యక్తి తన తండ్రి ఆరోగ్యం కోసం నిందితులను కలిశాడు. ఆరోగ్యం నయం చేసిన నిందితులు.. తిరుపతి ఇంటి పక్క గుడిసెలో గుప్తనిధులు ఉన్నాయని, వాటిని బయటకు తీస్తే రూ.కోట్లు వస్తాయని అంటారు.
వీరు చెప్పిందంతా నమ్మేందుకు సదరు గుడిసెలో రాత్రిపూట ఎవరూ లేని టైంలో గోతి తీసి ఇత్తడి శ్రీ కృష్ణుడు, విష్ణుమూర్తి విగ్రహాలను పెడతారు. తెల్లవారి వెళ్లి కుటుంబ సభ్యుల ముందే తవ్వి విగ్రహాలను బయటికి తీసి నమ్మిస్తారు. అంతేకాకుండా తిరుపతి కుటుంబ సభ్యులపై ఎవరో చేతబడి చేశారని, తాము చెప్పిన పూజలు చేయించుకోకపోతే చనిపోతారని బెదిరిస్తారు.
ఈ క్రమంలో ముఠా సభ్యులు వారిపై పసుపు, కుంకుమ చల్లి, నమ్మికాయలు తిప్పి శరీరంపై వారికి కాట్లు పెట్టి తాయత్తులు కడతారు. ఆ తర్వాత గోదావరిలో విగ్రహాలకు స్నానం చేయించాలని తీసుకెళ్తారు. తిరిగి నిందితులు తమ ఇంటికి వెళ్లి విగ్రహాలను డబ్బాలో దాచిపెడతారు. అయితే ఇలా అనేక రోజులుగా పూజలు చేస్తుండడంతో బాధితులకు అనుమానం వచ్చి ఈ నెల 22న లక్ష్మణ్ ఇంటికి వెళ్లి చూడగా స్టీల్ డబ్బాలో ఒకటే విగ్రహం ఉంటుంది. మరో విగ్రహం ఏదని అప్పాల లక్ష్మన్ను నిలదీస్తారు.
నిందితులు మోసం చేస్తున్నారని బాధితులకు తెలిసిపోయింది. వివాదాన్ని సెటిల్మెంట్ చేసుకుందామని బాధితులను స్థానిక ఎల్బీ స్టేడియం వద్దకు రావాలని చెబుతారు. వారు రాగానే నిందితులు పథకం ప్రకారం దాడిచేసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో తిలక్నగర్లో లీలామ్ రామాదేవి ఇంట్లో అప్పాళా లక్ష్మన్, లీలమ్ పాండు రాజు, గంగారపు వినయ్, వాసం రాజేశ్ను గోదావరిఖని వన్టౌన్ సీఐలు రమేశ్బాబు, ప్రసాద్రావు, ఎస్ఐ కే రమేశ్ పట్టుకున్నట్లు తెలిపారు.
వారి నుంచి రూ.1.5లక్షల నగదు, ఇత్తడి కృష్ణుడి, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితులు గతంలో గోదావరిఖనికి చెందిన ఓ వ్యక్తికి సిరిసిల్లలో ఉన్న వెంచర్లో గుప్త నిధులు ఉన్నాయని పూజలు దాదాపు రూ.5లక్షల తీసుకున్నట్లు చెప్పారు. కేసును చేధించిన సీఐలు, ఎస్ఐని ఏసీపీ అభినందించారు.