Modern Market | వెజ్, నాన్వెజ్, పూలు, పండ్లు.. ఇలా ఏది కావాలన్నా ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్లకు రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. నియోజకవర్గ కేంద్రానికి ఒకటి చొప్పున మంజూరు చేయగా, జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఒక్కోచోట రెండెకరాల స్థలంలో 5కోట్లకు పైగా వ్యయంతో రూపుదిద్దుకుంటుండగా, దాదాపు అన్ని చోట్లా పనులు తుది దశకు చేరుకుంటున్నాయి. త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలుండగా, పట్టణవాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– జగిత్యాల, మే 29 (నమస్తే తెలంగాణ)
జగిత్యాల, మే 29 (నమస్తే తెలంగాణ): ‘ఏమండి.. ఈ రోజు మా అమ్మానాన్న వస్తున్నరు. మా అన్నయ్య, తమ్ముడికి పోట్ల కూర తేండి. మా నాన్నకు ఫిష్ తీసుకురండి. అది కూడా కొర్రమీను మాత్రమే. ఈ రోజు మా అమ్మకు మంగళవారం. మాంసాహారం తినదు. బీరకాయలు, బీన్స్ తెండి. అట్లనే ఆపిల్స్, చెర్రిపండ్లు తీసుకురండి. ఇంకా మా అమ్మ ఈ రోజు ఆంజనేయస్వామికి పూల మాల వేస్తుంది. మల్లెపూలు, కనకాంబరాలు తెండి’ అని ఓ భార్య చెప్పిన జాబితా విన్న పతిదేవుడు హరీమన్నాడు. ‘ఇవన్నీ మార్కెట్లకు నేనేట్ల పోవాల్నే? ఇది అయ్యేపనేనా..? జగిత్యాలలో టవర్ దగ్గర కూరగాయల మార్కెట్ ఉంది. ఆ తర్వాత మటన్ కోసం వెళ్లాలి. చేపలంటే కొత్తబస్టాండ్ దగ్గరికి, పూల కోసం కొత్తబస్టాండ్ దగ్గరికి, పండ్ల కోసం గొల్లపల్లి రోడ్డుకు పోవాలె. ఎట్ల చచ్చేది? ఎంతని తిరిగేది?’ అంటూ వాపోయా డు.
జగిత్యాలలో సగటు మనిషి ఇన్నాళ్లూ అనుభవించిన ఇబ్బందులివి. ఇప్పుడు ఆ బాధలన్నీ అధిగమించేందుకు కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు అన్ని ఒకే చోట లభించేలా రాష్ట్ర ప్రభుత్వం సమీకృత మార్కెట్ నిర్మాణాలకు శ్రీకా రం చుట్టింది. సమైక్య రాష్ట్రంలో పాలకులు పట్టణాల్లో ప్రజలకు సరైన కూరగాయల మార్కెట్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్ల అంగడ్లను తెరిచేశారు. పట్టణవాసులు ఇవన్నీ కొనాలం టే ఇబ్బందికరమైన వ్యవస్థగా మారిపోయింది.
అవసరమైన వస్తువుల కోసం సిటీ మొత్తం తిరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే సీఎం కేసీఆర్ పట్టణాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించి, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత మార్కెట్లు నిర్మించాలని, అందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గ కేంద్రాల్లో సకల సౌకర్యాలతో సమీకృత మార్కెట్ల నిర్మాణం జరిగిన నేపథ్యంలో వాటి ఆధారంగా నిర్మాణాలు ఉండాలని సూచించడంతో జగిత్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి.
జిల్లా కేంద్రంలో 4.50 కోట్లతో మార్కెట్
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏడు దశాబ్దాలుగా టవర్ సర్కిల్ ప్రాంతంలోనే కూరగాయల మార్కెట్, మాంసం మార్కెట్ నడుస్తున్నది. జగిత్యాల పట్టణ విస్తీర్ణం పెరిగినప్పటికీ మార్కెట్ మాత్రం అభివృద్ధి జరుగలేదు. పాతికేండ్ల క్రితం జగిత్యాలలో 50లక్షల వ్యయంతో రైతుబజార్ నిర్మించినా అది చాలా కాలం నుంచి నిరుపయోగంగా ఉన్నది. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ చొరవ చూపడంతో రైతుబజార్ వినియోగంలోకి వచ్చింది. అయినప్పటికీ జిల్లా కేంద్రంలో కూరగాయల మార్కెట్ విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తూనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, శరవేగంగా సాగుతున్నది. పట్టణ ప్రగతి ప్రత్యేక నిధుల నుంచి 4.50 కోట్లతో రెండు ఎకరాల విశాల స్థలంలో పూర్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణాన్ని చేపట్టారు. మున్సిపాలిటీలోని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాలు సాగుతున్నాయి. రెండెకరాల స్థలంలో రెండు భారీ షెడ్లతో, కౌంటర్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ మార్కెట్లో కూరగాయలు, పూలు, పండ్ల విక్రయంతో పాటు, చేపలు, మాంసం మార్కెట్లు సైతం ఏర్పాటయ్యాయి. మరో రెండు మూడు నెలల్లో మార్కెట్ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ధర్మపురిలో 85శాతం పూర్తి
ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత మార్కెట్ దాదాపు పూర్తి కావచ్చింది. మార్కెట్ నిర్మాణానికి మంత్రి కొప్పుల ఈశ్వర్, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి ముందు 2 కోట్లు మంజూరు చేయించారు. ఈ నిధులతో ఎకరంన్నర స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం ప్రారంభమైంది. అయితే మధ్యలో నిధులకు ఇబ్బంది రావడంతో మరో 2.5కోట్లను ధర్మపురి మున్సిపాలిటీ పట్టణ ప్రగతి నిధుల నుంచి కేటాయించారు. మొత్తంగా 4.5కోట్ల అంచనాలతో ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది. దాదాపు 85 శాతానికి పైగా పూర్తి కావచ్చింది. షెడ్లు వేయడంతో పాటు, కౌంటర్ల నిర్మాణం, గద్దెల నిర్మాణం సైతం పూర్తయింది. గద్దెలపై గ్రానైట్ వేయడం సైతం కావచ్చింది. త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మార్కెట్ ప్రారంభోత్సవం ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెబుతున్నారు.
6 కోట్లతో కోరుట్ల మార్కెట్..
కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోనూ సమీకృత మార్కెట్ లేక ప్రజలు ఏండ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు కృషి ఫలితంగా కోరుట్ల పట్టణ ప్రగతి నిధులు 6 కోట్లు మంజూరు చేశారు. రెండెకరాల స్థలంలో నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. కాగా, ఈ మార్కెట్లు పూర్తయితే కూరగాయలు, చేపలు, మాంసం, పండ్లు, పూల వ్యాపారం అంతా అక్కడే జరుగుతుందని, అలాగే వాటికి అనుబంధమైన ఇతర దినుసులకు సంబంధించిన వ్యాపార కేంద్రాలు సైతం ఒకే చోట వృద్ధి చెందనున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వ్యాపారపరంగా వృద్ధి చెందడంతోపాటు పట్టణ ప్రజలకు ఒకే చోట అవసరమైన అన్ని కూరగాయలు, ఇతర వస్తువులు లభ్యమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.