వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో తక్కువ కాల పరిమితి పంటలను ఎంచుకోవాలని, వాతావరణ విభాగం అధికారులు సూచించిన విధంగా పంటలు విత్తుకోవాలని చెబుతున్నారు. ఏ పంటలు ఏ సమయం వరకు విత్తుకోవాలో రైతులకు వివరిస్తున్నారు. వచ్చే నెల 31 వరకు వివిధ రకాల పంటలు వేసుకోవాలని, రైతులు వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. జూన్ ఒకటిన కేరళను తాకాల్సిన రుతుపవనాలు 8న వచ్చినట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా, గుజరాత్లో ఏర్పడిన తుఫాన్ల కారణంగా ఇప్పటి వరకు రాష్ర్టానికి రుతు పవనాలు తాకలేదని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విత్తుకోవడానికి అదను దాటిపోతున్నదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు సూచిస్తున్నారు. కాగా, రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు పంటల ఎంపిక కీలకంగా ఉంటుంది. తక్కువ కాలపరిమితి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. 10 నుంచి 15 శాతం ఎక్కువ విత్తనాలు వేసుకోవాలి. నీటి వినియోగం తక్కువ ఉండే పంటలను, పరిస్థితులను తట్టుకునే పంటల రకాలను విత్తుకోవడం మంచిది. అంతర పంటల్లో ధాన్యపు పంటలకు బదులు పప్పు దినుసులు లేదంటే నూనె గింజల పంటలు వేసుకోవడం మంచిది. సోయా చిక్కుడు, పత్తి తేలికపాటి నేలల్లో వర్షాధారపు పంటగా ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. ఈ ఏడాది సాధారణ వర్ష పాతం మాత్రమే నమోదు కావచ్చని వాతావరణ శాఖ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ సూచనలు తప్పని సరి పాటించాలని జిల్లా వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
డ్రమ్ సీడర్లు : రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల, రైతు వేదికల్లో డ్రమ్ సీడర్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, వాటిని వినియోగించుకొని సాగు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. మొదట పొలాన్ని దున్ని దమ్ము చేయాలి. సాధారణ పద్ధతి మాదిరిగానే ఎకరా సాగుకు 30 కిలోల విత్తనాలు సరిపోతాయి. కిలో విత్తనానికి ఒక గ్రాము కార్బండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. 24 గంటల పాటు విత్తనాన్ని నానపెట్టాలి. కొంత ముక్కు పగిలిన గింజలను తక్కువ నీరు ఉండే బురద పదనలో డ్రమ్ సీడర్ను ఉపయోగించి చల్లుకోవాలి. ఆ తర్వాత రెండు మూడు రోజుల పాటు నీరు పెట్టకూడదు. డ్రమ్సీడర్తో విత్తనం వెదజల్లటం వల్ల నిర్దిష్టమైన అంతరంతో సాళ్లు వస్తాయి. రైతులు తిరిగేందుకు కలుపు తీసేందుకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాళ్ల మధ్యన మూడు సార్లు వీడర్ను ఉపయోగించి కలుపు మొక్కలను తొలగించాలి. ఆ తర్వాత కలుపు నివారణ మందులను చల్లాలి. 25 రోజుల తర్వాత ఆరుతడులుగా నీటిని అందించాలి. పిలక దశలో ఒక బస్తా యూరియా, ఒక బస్తా డీఏపీ చల్లాలి. పొట్ట దశలో ఉన్నప్పుడు ప్రొఫినోపాస్ను పిచికారీ చేయాలి. సాధారణ పద్ధతి కంటే 10 రోజుల ముందే కోతకు వస్తుంది. పంట లేత పసిమి ఉన్నప్పుడే పంట కోయాలి. పిలకలు చాలా రావడం వల్ల సాధారణ పద్ధతిలో కంటే అధిక దిగుబడి వస్తుంది.
పత్తి : ఈ పంటను జూలై 20 వరకు విత్తుకోవచ్చు. తేలిక నేలల్లో 50-60 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తిని విత్తుకోవాలి. లేదంటే నేల 15 సెంటీ మీటర్ల వరకు తడిసిన తర్వాత మంచి తేమలో పత్తిని విత్తుకుంటే భూమిలో వేడి తగ్గి, మొలక శాతం బాగుంటుంది. న్యూమాంటిక్ ప్లాంటర్ యంత్రం ద్వారా అధిక సాంద్రత పద్ధతిలో 90 x 15 సెంటీ మీటర్ల దూరంలో విత్తుకోవచ్చు. పత్తిలో అంతర పంటగా కంది వేసుకుంటే మంచి లాభాలు రావచ్చు.
కంది : పత్తి పంటలో అంతర పంట కింద కంది లాభాలను ఇస్తుంది. ఈ నేపథ్యంలో కందిని అంతర పంటగా సాగు చేసుకోవడం మంచిది. పెసర, మినుము, పల్లి, ఆముదం, ఇతర పంటల్లో అంతర పంటగా విత్తుకోవచ్చు. సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం ద్వారా ఆగస్టు 15 వరకైనా కందిని విత్తుకోవచ్చనే విషయాన్ని రైతులు గమనించాలి.
సోయా : జూన్ నెలాఖరులోగా దీనిని విత్తుకోవడం మంచిది. సరైన సస్య రక్షణ చర్యలు చేపట్టి జూలై మొదటి వారం వరకు కూడా ఈ పంటలను విత్తుకోవచ్చు. జూలై మొదటి వారంలో విత్తుకున్నా మంచి దిగుబడులు వస్తాయి.
మక్క జొన్న : నీటి ఎద్దడిని తట్టుకోలేదు. ఈ నేపథ్యంలో బోదె, సాళ్ల పద్ధతిని ఆచరించడం మంచిది. ఈ పద్ధతి పాటిస్తే పంటకు ఎక్కువ కాలం తేమ అందుబాటులో ఉంటుంది. జూలై 15 వరకు విత్తుకునేందుకు అవకాశం ఉంది.
ఆరుతడి పంటలు : ఇతర ఆరుతడి పంటల్లో పెసర, మినుము పంటలను జూలై 15 వరకు విత్తుకోవచ్చు. సరైన మొక్కల సంఖ్యను పాటించడం వల్ల ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఆముదం, పొద్దు తిరుగుడు, ఉలువలు వంటి పంటలు జూలై 31 వరకు విత్తుకోవచ్చు.
వరి : నార్లు పోసుకోవడానికి ఇంకా సమయం ఉన్నది. 140-150 రోజుల మధ్య దిగుబడి వచ్చే వరి రకాల కోసం జూన్ 20 నుంచి నార్లు పోసుకోవచ్చు. 130-135 రోజుల్లో దిగుబడి వచ్చే మధ్య కాలిక రకాల కోసం జూలై 10 వరకు నార్లు పోసుకోవచ్చు. ఇందులో వరంగల్ సన్నాలు, పొలాస ప్రభా, జేజీఎల్ 384, జేజీఎల్ 11470, డబ్ల్యూజీఎల్ 3962లను సాగు చేయవచ్చు. 120-125 రోజుల్లో దిగుబడి వచ్చే స్వల్ప కాలిక రకాలకు సంబంధించిన జూలై చివరి వరకు నార్లు పోసుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైన తెలంగాణ సోనా, కూనారం సన్నాలు, ఎంటీయూ 1001, జేజీఎల్ 1798, జేజీఎల్ 24423, బతుకమ్మ రకాలను సాగు చేసుకోవడం మేలు.వరి సాగులో నేరుగా విత్తు దమ్ముచేసి లేదంటే దమ్ము చేయకుండా సీడ్ కమ్ ఫెర్టీ డ్రిల్ పద్ధతులపై రైతులు శ్రద్ధ వహించాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
వెదజల్లే పద్ధతి : నారు పోసుకునే సమయం ఆలస్యం కావడంతో ప్రత్యామ్నాయమైన వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు చేయవచ్చు. ఇంటి వద్దే విత్తనాలను మండె కట్టుకొని 2-3 రోజుల్లో మొలక వచ్చిన తర్వాత దమ్ము చేసిన పొలంలో వెదజల్లాలి. దున్నిన పొలంలో నీళ్లు నిలవ ఉండకుండా చూడాలి. ఎత్తు పల్లాలు లేకుండా భూమి సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువగా నీరు పారించకుండా పలుచగా పెట్టినట్లయితే విత్తనాలు కుళ్లిపోకుండా మొలక శాతం పెరుగుతుంది.
వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లో రైతులు ఇందుకు అనుగుణంగా పంటలు ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా వరి, పత్తి, మక్క, తదితర ప్రధాన పంటల ఎంపికలో రైతులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. పరిస్థితులకు అనుగుణంగా వేసుకోవాల్సిన పంటల గురించి, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యవసాయ అధికారులు చేస్తున్న సూచనలు ఇలా ఉన్నాయి.
రైతులు మూస ధోరణిలో కాకుండా ఆధునిక పద్ధతులను అనుసరిస్తే రైతులకు నికర ఆదాయం పెరుగుతుంది. డ్రమ్సీడర్ పద్ధతిలో వరి వేయడం వల్ల ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం మాత్రమే అవసరం. ఈ విధానంలో అలుకుడు ఉండదు. నానపెట్టిన వరి గింజలను యంత్రం ద్వారా నేరుగా సాలు పద్ధతిలో విత్తనం వేయాలి. కూలీలు నలుగురు ఉండే 5 ఎకరాల వరకు యంత్రాలతో వరి విత్తనాలు వేయవచ్చు. ఈ విధానాన్ని రైతులు అవలంభిస్తే కూలీల, విత్తనం ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అలుకుడు పద్ధతిలో ఖర్చు ఉండదు. విత్తన దశలోనే ఎకరాన రూ.5 వేల వరకు పెట్టుబడి మిగులుతుంది. డ్రమ్సీడర్ వినియోగంలో మెళకువలతో మరింత మేలు చేకూరుతుంది.
– పీ సురేశ్కుమార్, డీఏఈవో (జగిత్యాల)
అదను దాటి పోతున్నదని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రుతు పవనాలు ఆలస్యమైన రెండు మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనువైన పరిస్థితులు నెలకొన్న తర్వాతే పంటలు విత్తుకోవడం మంచిది. ఈసారి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు దీర్ఘకాలిక పంటల కంటే మధ్య, స్వల్పకాలిక పంటలను ఎంచుకోవడం మంచిది. వాతావరణానికి అనువైన పంటలు విత్తుకుంటే ఎలాంటి నష్టం ఉండదు. స్వల్ప కాలిక రకాలను ఎంచుకుని జూలై చివరలో నార్లు పోసుకుని ఆగస్టులో నాట్లు వేసుకోచ్చు. పత్తి విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. 50-60 సెంటీ మీటర్ల వర్షం కురిసిన ప్రాంతాల్లో మాత్రమే పత్తి విత్తుకోవాలి. సోయా మినహాయించిన ఆరుతడి పంటలు ఆగస్టులో విత్తుకున్నా నష్టం లేదు.
– వాసిరెడ్డి శ్రీధర్, డీఏఈవో (కరీంనగర్)
వాన కాలంలో కరీంనగర్ జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులు పంట సాగు అంచనా ప్రకారం వరి 2,72,500, మక్క జొన్న 4,500, పెసర వెయ్యి, పత్తి 48 వేలు, బబ్బెర 5, మినుములు 5, నువ్వులు 25, కందులు 2,500, పల్లి 300, పసుపు 100, పొద్దు తిరుగుడు 5, ఇతర పంటలు 10,110 మొత్తం 3,39,050 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నది. ఇందుకు సంబంధించిన ఎరువులు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయి.