వేములవాడ టౌన్, డిసెంబర్ 1: వేములవాడకు చెందిన ప్రముఖ కవి, న్యాయవాద రచయిత, సాహితీవేత్త, విశ్రాంత జిల్లా జడ్జి మంగారి రాజేందర్(జింబో) ‘పోలీసు అధికారులు – సమన్యాయ పాలన – ఎన్కౌంటర్ మరణాలు’ అంశం మీద చేసిన పరిశోధనకు ఉస్మానియా యూనివర్సిటీ న్యాయవిద్యావిభాగం పీహెచ్డీని ప్రకటించింది. పర్యవేక్షకుడిగా ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.వెంకటేశ్వర్లు వ్యవహరించారు. మంగారి రాజేందర్ జిల్లా జడ్జిగా విధులు నిర్వర్తించే సమయంలోనే పరిశోధన చేపట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణానికి చెందిన మంగారి రాజేందర్ వేములవాడలోనే పదో తరగతి వరకు విద్యాభ్యాసం చేశారు. తర్వాత ఉస్మానియా నుంచి లా పట్టా పొందారు.
నాలుగు దశాబ్దాల నుంచి న్యాయవాద రంగంపై వివిధ పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో 52 వరకు లా పుస్తకాలను వెలువరించారు. 4 కవిత్వాలు, 5 కథల పుస్తకాలు రాశారు. లా పుస్తకాలను తెలుగులో వెలువరించారు. జిల్లా జడ్జిగా ఇటీవలే పదవీ విరమణ చేశారు. జింబో రాసిన మా వేములవాడ కథలు, జింబో కథలు, రూల్ ఆఫ్ లా కథలు, సాహితీలోకంలో విశేష పాఠకాదరణ పొందాయి. జ్యుడీషియల్ అకాడమీ, పోలీస్ అకాడమీతోపాటు ఏసియా బుక్ హౌస్, ఆంధ్ర లీగల్ డెషిషన్స్ లాంటి ప్రచురణా సంస్థలు ఆయన పుస్తకాలను ప్రచురించాయి. ఆయన రచనలకు గాను పలు పురస్కారాలు అందుకున్నారు. మంగారి రాజేందర్ (జింబో)కు కవిత్వం, కథలు ఉచ్వాస నిశ్వాసలు. అందరికీ న్యాయం అందాలన్నది ఆయన అభిమతం. జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయన నిజామాబాద్లో జడ్జిగా ఉన్న సమయంలో తెలుగులో మొట్టమొదటి తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిగా రికార్డుల్లోకెక్కారు. పీహెచ్డీ అందుకున్న సందర్భంగా ప్రముఖ కవి, చరిత్రకారులు సంకేపల్లి నాగేంద్రశర్మ, ప్రముఖ కవి, దాశరథి పురస్కార గ్రహీత వఝల శివకుమార్, పీఎస్ రవీంద్రతో పాటు పలువురు రచయితలు, కవులు మంగారి రాజేందర్కు అభినందనలు తెలపారు.