నాలుగు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలతో చినుకు చినుకూ తోడై వరద పోటెత్తుతున్నది. ఉమ్మడి జిల్లాలో చెక్డ్యాంలు, చెరువులు, కుంటలు జలసవ్వడి చేస్తున్నాయి. మత్తడి దుంకుతూ పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తున్నాయి. పాల నురగల్లా దిగువకు జాలువారుతూ జలపాతాలను తలపిస్తున్నాయి. కాళేశ్వరం జలాలకు తోడు వానలతో జలవనరులు నిండుకుండల్లా మారి పంటలకు భరోసానిస్తున్నాయి. భూగర్భ జలాలు అమాంతం పెరిగి సాగునీరు, తాగునీటికి ఢోకాలేకుండా చేస్తుండగా, రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరీంనగర్, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ గంగాధర/ రామడుగు : వరుస వర్షాలతో జలవనరులు కళకళలాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో నాలుగైదు రోజులుగా జోరుగా వానలు పడుతున్నాయి. దాంతో చెరువులు, కుంటలు మత్తడులు దుంకుతున్నాయి. వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. వరద నీటిని ఒడిసి పట్టేందుకు ప్రభుత్వం నిర్మించిన చెక్ డ్యాంలు జళకళ సంతరించుకున్నాయి. మత్తళ్లు దూకుతూ జల సవ్వడి చేస్తున్నాయి. వానకాలం మొదట్లో చుక్కనీరు లేక అల్లాడిపోయిన రైతులు, కాళేశ్వరం జలాలతోపాటు ఇప్పుడు విస్తారంగా కురిసిన వానలతో సంబురపడుతున్నారు. సంతోషంగా సాగు పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే సింహభాగం పంటల సాగు పూర్తికాగా, మిగతా పంటలు వేసేందుకు రైతులు సాగులో సిద్ధమయ్యారు.
ఎల్ఎండీకి వరద..
ఎల్ఎండీ జలాశయంలోకి వరద కొనసాగుతున్నది. మోయతుమ్మెద వాగు నుంచి 4,968 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఇక విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మధ్య మానేరు నుంచి నీటి విడుదలను తగ్గించారు. ప్రస్తుతం 3,060 క్యుసెక్కుల నీరు ఎల్ఎండీకి వదిలారు. ప్రస్తుతం డ్యాంలో 12.221 టీఎంసీలకు నీరు నిల్వ ఉంది.
ఎస్సారార్ @ 15 టీఎంసీలు
ఎగువన మూలవాగుతోపాటు వరదకాలువ ద్వారా మాన్వాడలోని శ్రీరాజరాజేశ్వర జలశయానికి 2వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలో 15.33 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. 4 గేట్ల ద్వారా 3060 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.