ఈ ప్రాంత ప్రజలతో నన్ను విడదీయలేరు
ఇక్కడ లేకపోయినా నిత్యం మాట్లాడుతున్నా
ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు
వేములవాడ, జూలై 26: వేములవాడ నియోజకవర్గంతో తనది పవిత్రబంధం అని, ఇక్కడి ప్రజలతో తనను విడదీయలేరంటూ వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చేరుకున్న ఆయన తన నివాసంలోని సంగీత నిలయంలో ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశంలో మాట్లాడారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తాను కొంతకాలంగా జర్మనీలో ఉన్నానని, ఇక్కడ లేకపోయినా నిత్యం అధికారులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేశానన్నారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే జిల్లా మంత్రి కేటీఆర్తో చర్చించామని చెప్పారు. జేఎన్టీయూ కళాశాలను వేములవాడ పరిధిలో ఏర్పాటు చేయాలని కూడా విన్నవించామన్నారు. 8000 డబుల్ బెడ్ రూం ఇళ్లు, గంభీర్పూర్లో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్, ఇతర అభివృద్ధి పనులపై కూడా మరోసారి చర్చించి వేగవంతానికి కృషిచేస్తామన్నారు. ఈ ప్రాంత ప్రజలు తనకు అవకాశం కల్పించారని, ఈ ప్రజలతో ఉన్నది పవిత్ర బంధమని, తనను విడదీయలేరని చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ఎంపీపీలు బూర వజ్రమ్మ, గంగం స్వరూపరాణి, జడ్పీటీసీలు మ్యాకల రవి, గట్ల మీనయ్య, ఏఎంసీ చైర్మన్ హనుమాండ్లు, మున్సిపల్ వైస్ఛైర్మన్ మధు రాజేందర్, పార్టీ పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు ఉన్నారు.