టీఆర్ఎస్ వెంటే పట్టభద్రులు
ఎమ్మెల్సీగా రెండోసారి రాజేశ్వర్రెడ్డి గెలుపు
ఎలిమినేషన్ రౌండ్స్లో వరించిన విజయం
తొలి ప్రాధాన్యత ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యం
రెండో స్థానంలో మల్లన్న.. ఆ తర్వాత కోదండరాం
బీజేపీ, కాంగ్రెస్ నాలుగు, ఐదు స్థానాలకు పరిమితం
90 గంటల పాటు సాగిన లెక్కింపు ప్రక్రియ
ఈ విజయం.. అద్వితీయం ఇది ప్రగతికి జరిగిన పట్టాభిషేకంఅపోహలకు, ప్రశ్నిస్తామన్నగొంతులకు నిక్కచ్చి సమాధానంవిద్వేష శక్తులకు, విపరీత బుద్ధులకు చెంపపెట్టుఇది విజ్ఞులైన పట్టభద్రులు ఇచ్చిన తీర్పుకేసీఆర్ సర్కారుపై సడలని అభిమానాన్ని,విశ్వాసాన్ని చాటిన చైతన్యపు నేర్పు.
ఖమ్మం, మార్చి 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. కారుజోరుకు ప్రతిపక్ష పార్టీల అడ్రస్ గల్లంతు అయ్యింది. పల్లా గెలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలుచోట్ల బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ నెల 14న పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరగ్గా.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగా ఓటింగ్ శాతం నమోదైంది.
జిల్లాలో 74.36 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 73 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ విజయానికి పెరిగిన పోలింగ్ శాతమే నిదర్శనమని పలువురు టీఆర్ఎస్ నేతలు విజయంపై ఆ రోజే భరోసా వ్యక్తం చేశారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే ఓటర్ల నమోదు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. ఇది టీఆర్ఎస్కు కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నెల 17న నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నాలుగు రోజులపాటు ఉత్కంఠ భరితంగా కొనసాగింది. అయితే, తొలి ప్రాధాన్యత ఓటు, రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ ఆది నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత స్థానాలకు ఇతర పార్టీల అభ్యర్థులు పరిమితమయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి ప్రతి రౌండ్లోనూ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. నాలుగు రోజులుగా ప్రతి రౌండ్లోనూ అదే పరిస్థితి.
కేసీఆర్ పాలనకు అన్ని వర్గాల మద్దతు
పట్టభద్రులు మరోసారి పల్లాకు పట్టం కట్టారు. అభివృద్ధి, సంక్షేమానికి మద్దతుగా నిలిచారు. పట్ట్టభద్రులు, ప్రజలు గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థికి విజయం కట్టబెట్టారు. ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారు. ఈ నెల 17న నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నాలుగు రోజులపాటు ఉత్కంఠ భరితంగా కొనసాగింది. శనివారం రాత్రి పల్లా విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల సంబురాలు మిన్నంటాయి. నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన పల్లా రాజేశ్వర్రెడ్డి వరుసగా రెండోసారి శాసన మండలికి వెళ్లనున్నారు. కాంగ్రెస్, బీజేపీతోపాటు ఇతర అభ్యర్థులు అసత్యారోపణలు చేసినా ఓటర్ల్ల తీర్పు ముందు అవన్నీ బలాదూర్ అయ్యాయి. సుమారు 90 గంటల పాటు నిర్విరామంగా, సజావుగా సాగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసాంతం ఆసక్తికరమే. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రతి రౌండ్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకే మెజారిటీ దక్కగా, రెండో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మల్లన్న, మూడో స్థానంలో కోదండరాం నిలిచారు.
అన్ని వర్గాల మద్దతు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టభద్రులు, యువకులు, నిరుద్యోగులు, ఉపాధ్యాయ, ఉద్యోగవర్గాలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి వెన్నుదన్నుగా నిలిచారనడానికి ఆయన గెలుపే నిదర్శనం. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా గెలువడం ఇది రెండోసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించడంతో రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు పూర్తి మద్దతు తెలుపుతున్నారనడానికి ఈ ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయమే నిదర్శనమని మంత్రి పువ్వాడ అజయ్ అభిప్రాయపడ్డారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు ఆర్వీ.కర్ణన్, డాక్టర్ ఎంవీ.రెడ్డి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. అదనపు కలెక్టర్లు మధుసూదన్, వెంకటేశ్వర్లుతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించిన పోలింగ్ అధికారులు, సిబ్బంది నాలుగు రోజులు కౌంటింగ్లో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోలింగ్ పూర్తయిన వెంటనే జంబో బ్యాలెట్ బాక్సులను నల్గొండ జిల్లా కేంద్రానికి తరలించడం నుంచి కౌంటింగ్ సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాంటి ఉద్రిక్తత తలెత్తకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
సమన్వయంతో ముందుకు..
ఎన్నికల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ విజయానికి మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, రాములునాయక్, హరిప్రియా నాయక్, వనమా వెంకటేశ్వరరావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జీలు డాక్టర్ తెల్లం వెంకట్రావు, తాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల జడ్పీ చైర్మన్లు లింగాల కమల్రాజు, కోరం కనకయ్య, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి తాతా మధుసూదన్, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ తదితరులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా విజయానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. క్షేత్రస్థాయిలో ముమ్మరంగా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో సక్సెస్ అయ్యారు.