యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ అభివృద్ధి
రోడ్ల విస్తరణను వేగవంతం చేయాలి
మంత్రులు, అధికారుల సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): యాదాద్రి ఆలయ తరహాలో రాజన్న ఆలయ అభివృద్ధి చేపట్టాలని, టెంపుల్ టౌన్గా మార్చాలని మున్సిపల్, పరిశ్రమల శాఖల మం త్రి కేటీఆర్ మంత్రులు, అధికారులను ఆదేశించారు. ఆలయ విస్తరణ, పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. ప్రగతి భవన్లో గురువారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, వీటీడీఏ దేవాదాయ శాఖ అధికారులతో కేటీఆర్ రాజన్న ఆలయం, పట్టణాభివృద్ధిపై సమీక్షించారు. చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. దేశం అబ్బుర పడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి నర్సింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, అదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి పనులు ప్రారంభించుకున్నామన్నారు. వీటీడీఏ, దేవాదాయ, ఆర్అండ్బీ శాఖల అధికారులను భాగస్వాములను చేసి వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. వేములవాడ ఆలయ అభివృద్ధితోపాటు సమాంతరం గా పట్టణాభివృద్ధి జరిగేలా ప్రణాళికలు రూపొందించుకుని అన్ని శాఖలు పనిచేయాలని ఆదేశించారు. రాజన్న ఆలయం, పట్టణ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.
పర్యాటక కేంద్రంగా వేములవాడ, మధ్య మానేరు
వేములవాడ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా పుష్కరిణి, కల్యాణకట్ట, కల్యాణ మండపం, క్యూకాంప్లెక్స్, కళాభవనం పనులు పూర్తి చేయాలన్నారు. వేములవాడను సమగ్రంగా అభివృద్ధి చేయాలని, గుడి చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్ నిర్మించాలని సూచించారు. చెరువులో బోటింగ్ కోసం తగిన ఏర్పా ట్లు చేయాలని, వేములవాడ, మధ్య మానేరులో పర్యాటక రంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. దీంతో ఆలయ టెంపుల్ టూరిజం, పర్యాటక రంగం అభివృద్ధి చెంది స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడుతాయని చెప్పారు.
బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనుల్లో వేగం
బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన స్థల సేకరణ పనులు సత్వరమే చేపట్టాలని సూచించారు. విస్తరణలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న వారికి తగిన నష్టపరిహారం చెల్లించాలన్నారు. వేములవాడ పట్టణంలో దశల వారీగా రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. బస్టాండ్ నుంచి ఆలయం వరకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలన్నారు. మినీ ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టణాభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించాలని పురపాలక శాఖ అధికారులకు సూచించారు. పట్టణాభివృద్ధి కోసం వచ్చిన ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు మంత్రి కేటీఆర్కు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, వీటీడీఏ వైస్చైర్మన్ పురుషోత్తంరెడ్డి, ఆలయ ఈవో కృష్ణప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.