త్వరలోనే వినూత్న పథకానికి శ్రీకారం
ఆర్థిక సాయం అందించేందుకు సర్కారు సన్నద్ధం
అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్
ఆనందంలో నిరుపేదలు
రాజన్నసిరిసిల్ల/ పెద్దపల్లి, అక్టోబర్ 9(నమస్తే తెలంగాణ): ఇంటి స్థలం ఉండి ఇల్లులేని నిరుపేదల కల నెరవేరే సమయం ఆసన్నమైంది..ఇంటి నిర్మాణానికి రూ. 5లక్షలు అందించే పథకాన్ని ప్రారంభించేందుకు సర్కారు సన్నద్ధమైంది..త్వరలోనే ఈ స్కీంకు అంకురార్పణ చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. నియోజకవర్గానికి 1000 నుంచి 1500 మందిని ఎంపిక చేసి వర్తింపజేస్తామని చెప్పడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
గూడులేని నిరుపేద కుటుంబాలకు ఇండ్లు నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ముందుకెళ్తున్నది. 2014 ఎన్నికలకు ముందు డబుల్ బెడ్రూం పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీం కింద ఇప్పటికే ఉమ్మడిజిల్లాలో వేలాది ఇండ్లను నిర్మించి పేదలతో గృహాప్రవేశాలు చేయించింది. సమగ్ర సర్వే ద్వారా వచ్చిన దరఖాస్తులను గుర్తించి పెద్దపల్లి జిల్లాలో 3, 316 ఇండ్ల నిర్మాణానికి పరిపాలన మంజూరు లభించింది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 2064, పట్టణ ప్రాంతాల్లో 1330 ఇండ్ల నిర్మాణాలను ప్రారంభించారు. ఇప్పటి వరకు 400ల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రాజన్నసిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం ఏడు వేలు దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఆరువేల ఇండ్లు నిర్మించి లబ్ధిదారులకు అందించారు. జాగా ఉన్నవారికి ఇండ్ల పథకంతో మిగిలిన వారి సొంతింటి కల నెరవేరునున్నది. అయితే పల్లెలు, పట్టణాల్లో ఇండ్ల నిర్మాణానికి సరిపడా స్థలం దొరక్కపోవడం, నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకురాకపోవడం లాంటి అనేక సమస్యలు ఎదురుకావడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలం ఉండి ఇల్లులేని వారికి రూ. 5లక్షలు అందిస్తామని చెప్పింది. 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈస్కీంను పొందుపరిచింది. అయితే కరోనా ప్రభావంతో అమలులో కొంతమేర జాప్యం జరిగింది. తాజాగా వర్షకాలం అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ స్కీంను ప్రారంభిస్తామని చెప్పడంతో సొంత స్థలాలు ఉండి ఇల్లులేని నిరుపేదలు ఆనందంలో మునిగితేలుతున్నారు.
మధ్యతరగతి వారికి మేలు
సొంత ప్లాటు ఉండి ఇంటి నిర్మాణానికి డబ్బులు లేని వారు ఎందరో ఉన్నారు. ఇందులో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటారు. సొంత జాగ ఉండి ఇల్లు కట్టుకున్న వారికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం..ఇలాంటి నిర్ణయం తీసుకున్న సర్కారుకు ఆయావర్గాలు రుణపడి ఉంటయ్..