కమాన్చౌరస్తా, డిసెంబర్ 8 : దేవాదాయ ధర్మదాయ శాఖ పరిధిలో ఉన్న భూములను పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అడిషనల్ కమిషనర్ కే జ్యోతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వేంకటేశ్వర ఆలయంలో బుధవారం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ టీ శ్రీకాంత్ రావు, స్పెషల్ ఆఫీసర్/డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ ఏ చంద్రశేఖర్ సమక్షంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన దేవాలయ భూములపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అన్యాక్రాంతమైన భూముల విషయంలో పలు న్యాయపరమైన సూచనలు చేశారు. న్యాయపరమైన ఇబ్బందులు ఉన్న పలు భూముల విషయంలో సలహాలు ఇచ్చారు. దేవాదాయ శాఖ భూములన్నింటినీ ధరణి పోర్టల్లో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూములు అన్యాక్రాంతం కాకుండా దేవాదాయ శాఖ సిబ్బంది ఎప్పుడూ పర్యవేక్షించాలని ఆదేశించారు. భూములు ఆక్రమించిన వారిపై దేవాదాయ శాఖ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాలయ పర్యవేక్షకులు ఎన్ సుప్రియ, కార్యాలయ సిబ్బంది, కార్యనిర్వహణాధికారులు, సిబ్బంది పాలొన్నారు.