రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్
మన ఊరు-మన బడి పై జిల్లా స్థాయి సమావేశం
650 మంది ఆశ కార్యకర్తలకు 4జీ ఫోన్ల పంపిణీ
కరీంనగర్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు-మన బడి’ ద్వారా సర్కారు బడులను బలోపేతం చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన బడి’పై మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ర ్టవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.7,289 కోట్లు కేటాయించిందన్నారు. ప్రతి జిల్లాలో 2021-22 విద్యా సంవత్సరానికి 33 శాతం పాఠశాలలను అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఆయా మండలాలు, పట్టణాల్లో అత్యధిక మంది విద్యార్థులున్న పాఠశాలలను గుర్తించి వాటిని అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో గుర్తించిన పనులు సక్రమంగా ఉన్నాయా? లేదా? అని కలెక్టర్, అదనపు కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనలు, ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
రూ.30 లక్షల వరకు నామినేషన్ పద్ధతిన పనులను కలెక్టర్ ఎవరికైనా కట్టబెట్టవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు 10 నుంచి 15శాతం వరకు అడ్వాన్స్గా అమౌంట్ను ఇచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు. ఎవరైనా దాత రూ.2లక్షలు ఇస్తే పాఠశాల కమిటీలో సభ్యుడిగా చేర్చుకోవచ్చని, రూ.10 లక్షలు, ఆపై విరాళం ఇస్తే ఒక తరగతి గదికి దాత పేరు లేదా దాత సూచించిన పేరు పెట్టాలన్నారు. రూ.కోటి విరాళం ఇస్తే పాఠశాలకు దాత పేరును పెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా కింద ప్రభుత్వం ఇచ్చిన రూ.2కోట్ల నిధులను ఖర్చు చేయనున్నామని వెల్లడించారు. జిల్లా, మండల పరిషత్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.500 కోట్లు కేటాయించగా, రెండు మాసాల క్రితం రూ.250 కోట్లు ఆయా జిల్లాల జనాభాకు తగినట్లు విడుదల చేసిందని, అయితే ఆ నిధులను పాఠశాలల అభివృద్ధికే వినియోగించాలన్నారు.
జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ మాట్లాడుతూ.. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని కోరారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ఎన్ఆర్ఐలు, పూర్వ విద్యార్థులు చేయూతనందించాలని సూచించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలలను బాగు చేసుకుందామన్నారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ .. మన ఊరు-మన బడి ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, డీఈవో జనార్దన్రావు, ఎంఈవోలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆశ కార్యకర్తల సేవలు వెలకట్టలేనివి
విద్యానగర్, ఫిబ్రవరి 15: కరోనా కాలంలో ఆశ కార్యకర్తలు అందించిన సేవలు వెలకట్టలేనివని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సుమారు 650మంది ఆశ కార్యకర్తలకు 4జీ స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలందించడం కోసం, సాంకేతికను అందిపుచ్చుకోవడానికి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నామని తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్రెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక పాల్గొన్నారు.