తుది దశలో పనులు
భక్తులకు ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలు: మేయర్ వై సునీల్రావు
కార్పొరేషన్, ఫిబ్రవరి 12: నగరంలోని రేకుర్తిలో సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద ఇరుకుగా ఉండడంతో భక్తులు దర్శనం చేసుకోవడానికి గంటల తరబడి క్యూలైన్లలో నిల్చొని ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ వై సునీల్రావు చొరవతో బల్దియా నిధులు రూ. 1.30 కోట్లు కేటాయించగా, అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి.
గద్దెల చుట్టూ ఫ్లోరింగ్
గతంలో సమ్మక్క-సారలమ్మ గద్దెల చుట్టూ మట్టి ఉండడంతో బెల్లం, కొబ్బరి ముక్కలతో అక్కడి పరిసరాలు అపరిశుభ్రంగా మారి భక్తులు ఇబ్బందులు పడేవారు. బల్దియా నిధులు రూ. 1.30 కోట్లు కేటాయించగా, గద్దెల చుట్టూ ఫ్లోరింగ్ చేశారు. ఇందుకోసం సుమారు రూ. 40 లక్షలకుపైగా వ్యయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ పనులన్నీ తుది దశకు చేరుకున్నాయి. గుట్టపై రాళ్లను తొలగించి, క్యూలైన్లను విస్తరించారు. ఈ ప్రాంతంలోనూ సీసీ రోడ్లు నిర్మించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బారీకేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు చుట్టూ ఉన్న స్థలాలను కూడా మట్టితో చదును చేశారు. దీంతో గద్దెల వద్ద స్థలం విశాలంగా కనిపిస్తున్నది. భక్తులు త్వరగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సకల సదుపాయాలు
జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. జాతర ప్రదేశంలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నారు. కాకతీయ కాల్వలో ఉన్న చెత్తాచెదారం తొలగిస్తున్నారు. కాల్వ ద్వారా జాతర సమయంలో నీటి విడుదల చేసి, సాన్నాలకు ఇతర అవసరాలకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. వీటితో పాటు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేకంగా స్నానపు గదులు, షవర్స్, మంచినీటి సదుపాయం కల్పిస్తున్నారు. జగిత్యాల రోడ్డు నుంచి గద్దెల వరకు కాల్వకు ఇరువైపులా మట్టి రోడ్డును సిద్ధం చేశారు. గద్దెల చుట్టూ భక్తులు విశాలంగా తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
పార్కింగ్పై ప్రత్యేక దృష్టి
జాతర ప్రదేశం వరకు వాహనాలు వస్తుండడం… పార్కింగ్ సమస్యతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పోలీసులు, నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. జగిత్యాల రోడ్డు సమీపంలో సుమారు పదెకరాల ప్రైవేట్ స్థలాన్ని చదును చేసి పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, గద్దెల వెనుక ఉన్న చెరువు స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసుకునే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా జగిత్యాల రోడ్డు నుంచి గద్దెల వైపు వాహనాలను రానివ్వకుండా చర్యలు చేపడుతామని అధికారులు వెల్లడించారు. వ్యాపారులు షెడ్లు వేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, జాతర ప్రదేశంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పిస్తామని కార్పొరేటర్లు సుధగోని మాధవీకృష్ణగౌడ్, ఎదుర్ల రాజశేఖర్ స్పష్టం చేశారు.
పూర్తి సదుపాయాలు కల్పిస్తున్నం
సమ్మక్క జాతరకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నం. భక్తులు నేరుగా అమ్మవార్లను దర్శించుకొని సులువుగా వెళ్లే విధంగా సదుపాయాలు కల్పిస్తున్నం. గద్దెల వైపు వెళ్లే రహదారులను ఇప్పటికే సిద్ధం చేశాం. గద్దెల వద్ద చేపడుతున్న అభివృద్ధి పనులను మూడు రోజుల్లో పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నం. ఎక్కడికక్కడ వాహనాలను దారి మళ్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నం. పారిశుధ్య పనుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జాతర ప్రదేశం శుభ్రంగా ఉండేలా చూస్తం.
– మేయర్ వై సునీల్రావు
రెండు రోజుల్లో పనులు పూర్తి చేస్తం
సమ్మక్క జాతర ప్రదేశంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ రెండు రోజుల్లో పూర్తి చేస్తం. ఇప్పటికే సివిల్ వర్క్స్ అన్ని తుది దశకు చేరాయి. మరుగుదొడ్లు, స్నానపు గదులకు సంబంధించిన పనులు కూడా ప్రారంభించినం. త్వరగా పూర్తి చేస్తం. లైటింగ్, సౌండ్స్, వేదిక ఏర్పాటు పనులను జాతరకు రెండు రోజుల ముందు ప్రారంభిస్తాం. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నం. భక్తులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేస్తాం – మసూద్, డీఈ