ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
మార్కెట్ యార్డులో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
అనంతపల్లిలో రైతు బీమా ప్రొసీడింగ్ కాపీ అందజేత
బోయినపల్లి, ఫిబ్రవరి 12: అనేక పథకాల అమలు, వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఇస్తున్న ప్రాధాన్యంతో రైతులకు మంచిరోజులు వచ్చాయని, కండ్లలో ఆనందం కనిపిస్తున్నదని ఎమ్మెల్యే రవిశంకర్ ఉద్ఘాటించారు. శనివారం సాయంత్రం బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీ రోడ్లకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం అనంతపల్లిలో గంగాధర దుర్గవ్వ కుటుంబానికి, తడగొండలో తోట సత్తయ్య కుటుంబానికి రైతుబీమా ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా ఉండి రైతుబంధు, రైతుబీమా అందిస్తుందని తెలిపారు. చివరి మడికి నీరందించేందుకు అనేక ప్రాజెక్టులు నిర్మించిందని, కరెంట్ సమస్యను పరిష్కరించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ముదుగంటి సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, మండల రైతుబంధు కన్వీనర్ కొనుకటి లచ్చిరెడ్డి, సర్పంచ్లు గుంటి లతశ్రీ, కన్నం మధు, కోరెపు నరేశ్, నందయ్య, చిందం రమేశ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య పాల్గొన్నారు.