స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీఆర్, భక్తులు
శంకరపట్నం, ఫిబ్రవరి 12: మండలంలోని కొత్తగట్టు శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ జీవీఆర్ హాజరై స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. అంతకుముందు ఉదయం ఆలయంలో సుప్రభాతం, మేలుకొలుపు, నిత్యారాధన, మూల వరులకు పంచామృతాభిషేకం, అనంతరం రుత్వికరణం, రక్షాబంధనం, దీక్ష వస్త్రధారణ, దేవతాహ్వానము, వాస్తు పూజ, కుల దేవత స్థాపన, మధ్యాహ్నం ధ్వజారోహణ కార్యక్రమం, అనంతరం ఎదుర్కోళ్ల పర్వం నిర్వహించారు. ధ్వజారోహణం సందర్భంగా అర్చకులు విసిరిన పవిత్ర ప్రసాదమైన మలియ ముద్దలను అందుకోవడానికి భక్తులు పోటీ పడ్డారు. వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన పద్మశాలీ వంశీయులు పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు తీసుకొని వచ్చారు. వారు వధువు తరఫున ఎదుర్కోళ్ల క్రతువు నిర్వహించారు. కొత్తగట్టు గ్రామస్తులు వరుడి తరఫున పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. యాజ్ఞీకులు చిగురాల రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు శేషం మురళీధరాచార్యులు, మాధవాచార్యులు శ్రీమత్స్యగిరీంద్రస్వామి-భూదేవీ-నీలాదేవీల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి, తలంబ్రాలు, కానుకలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
కొత్తగట్టు ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
శ్రీమత్స్యగిరీంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. మత్స్యగిరీంద్రుడి ఆలయం కాకతీయుల కాలం నుంచి వెలుగొందుతున్నదని ఉద్గాటించారు. ఆలయ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్లో మత్స్యగిరీంద్రస్వామి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు భక్తుల హర్షధ్వానాల మధ్య పునరుద్గాటించారు. ఇక్కడ సుడా చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, జడ్పీటీసీలు లింగంపల్లి శ్రీనివాస్రెడ్డి, తాళ్లపల్లి శేఖర్గౌడ్, కొత్తగట్టు, గొల్లపల్లి గ్రామాల సర్పంచులు మొకిరాల కిషన్రావు, ఉడిగె రజిత, ఆలయ చైర్మన్ తూముల శ్యాంరావు, గట్టుదుద్దెనపల్లి హనుమాన్ ఆలయ చైర్మన్ గర్రెపల్లి శంకరలింగం, ఏఎంసీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, టీఆర్ఎస్ నాయకుడు సతీశ్రెడ్డి, ఈవో వెంకటయ్య, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.