జగిత్యాల కలెక్టరేట్: జిల్లాలో చేపట్టిన కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ప్రతిరోజూ ప్రతి సెంటర్లో వంద మందికి టీకాలు వేయాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి కొవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజు 161 నివాసాలు, 41 వార్డుల్లో 15,505 మందికి మొదటి డోసు, 3,848 మందికి రెండో డోసు వేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. వ్యాక్సిన్ వాయిల్స్, ఇంజక్షన్లను మండల కేంద్రాలకు సరిపడా పంపించాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి స్పందన తక్కువగా ఉన్నందున గ్రామీణ, అర్బన్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్కు సంబంధించి ప్రతిరోజూ నివేదికలు పంపించాలన్నారు. డాటా ఎంట్రీకి ఇబ్బందిలేకుండా చూసుకోవాలని, విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగులు, సిబ్బందికి మెమోలు జారీ చేయాలని, పునరావృతమైతే సస్పెండ్ చేయాలని సూచించారు. వ్యవసాయ పనులకెళ్లే వారి కోసం ఉదయం తొందరగా కొవిడ్ టీకా పంపిణీని ప్రారంభించి సాయంత్రం వరకు కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీ, డీఎంఅండ్హెచ్వో, డీపీఓ, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.