ఏ కవిత ఐతే పాఠకులతో కరెక్ట్గా కనెక్ట్ అవుతుందో ఆ కవితను పాఠకులు సరిగ్గా, సంపూర్ణంగా అర్థం చేసుకుంటారని చెప్పవచ్చు. ఐతే నిర్ణాయకమైన కొన్ని అంశాలలో ఇది కూడా ఒకటి అని మాత్రమే చెప్పగలం. మొదటి వాక్యానికి vice versa (రివర్స్) ఐన వాక్యం కూడా సరైనదేనా? కావచ్చు.
ఎలా నిదురోగలం?
అర్ధరాత్రి నిదురలోంచి లేచొచ్చి, ఒక మూడడుగుల మల్లె పూవు/నా పక్కగా వచ్చి నాన్నా’ అంటూ
నన్ను హత్తుకుని పడుకుంది.ఇక ఆ చీకట్లో ఒక నెగడు రగిలి, పేరులేని సుగం ధమేదో గాలిలో వీయగా, ఎక్కడో కొమ్మల్లో గూళ్ళల్లో పక్షులు రెక్కలు సర్దుకుంటున్న సవ్వడి ఒక నెత్తురుగీతం. ఒక శాంతి కపోతం.చలి చిక్కగా ధూపమై వీచే ఆ వేళల్లో ఆ గదిలో ఎక్కడ / వేలితో తాకినా ఒక కాంతి సంకేతం/ కొంత అలజడీ, కొంత అబ్బురమూ కొంత జీవితం పట్ల కృతజ్ఞతా, కొంత కరుణా బోల్డంత ఇష్టమూనూ నిదురలో ఏదో కలవరించి, మెల్లిగా కదిలిన ఆ మల్లెపూల కలనీ తెల్లగులాబీ మొగ్గలవంటి ఆ కళ్ళనీ / ఇలా చూసుకుంటూ, ఇక ఈ రాత్రి నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం?
కే శ్రీకాంత్ రాసిన ఈ కవితను చదువండి. ఈ కవితలో మనోహరత్వాన్ని, మృదుత్వాన్ని నింపుకున్న ఊహలు పాఠకుని మనసును మెత్తగా స్పృశించి, ఆర్ద్రతను కలిగిస్తాయి. మూడడుగుల మల్లెపూవు అనడమే కవిత్వం. కానీ కవిత ద్వారా కవి ఏం చెప్తున్నాడని ఆలోచించినప్పుడు, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు అర్థాన్ని గ్రహించే అవకాశమున్నది. ఈ కవితను సుమారు పది మంది కవులకు పంపి వారి అభిప్రాయం అడిగాను. వారు రకరకాల అభిప్రాయాలు వెల్లడించారు.అందులో ఆశ్చర్యమేం లేదు. కవి మనసు, పాఠకుని మనసు ఒకే wave lemgthలో ఉన్నప్పుడు, లేదా వారి అవగాహన ఒకేస్థాయిలో ఉన్నప్పుడు కవిత్వం మరింత సులభంగా అర్థమౌతుందనుకుంటాను.
కవిత్వం అర్థం కాకపోవడానికి వివిధ రకాల కారణాలుంటాయి. ఛందోబద్ధ పద్యాల్లో ఐతే ఎక్కువ ప్రౌఢభాషే ప్రధానమైన అడ్డంకి. దీనికి పూర్తిగా భిన్నంగా, కొన్ని వచన కవితల్లో అతి సరళమైన భాష ఉన్నప్పటికీ అసలు విషయం అర్థమవదు. కొన్ని సందర్భాల్లో సింటాక్స్ పరమైన అవకతవకలు అయోమయానికి దారి తీస్తాయి. అదనపు వివరణ ఇవ్వకపోవడం కొన్నిసార్లు కారణమౌతుంది. ఈ కవితలోని చివరి పంక్తి విషయంలో అదే జరిగింది. నువ్వైనా నేనైనా ఎలా నిదురోగలం, అనే పంక్తిలోని అసలైన ఉద్దేశాన్ని పట్టుకునేందుకు కొందరికి అదనపు వివరణ అవసరమౌతుంది. విస్పష్టంగా అర్థం కావటం కంటే హృదయాన్ని స్పృశించి, గాఢమైన అనుభూతిని కలిగించడం కవిత్వానికి ముఖ్యం.
కవిత ప్రారంభంలో ఎత్తుగడ, తర్వాత విస్తరణతో కూడిన మధ్యభాగం (body), ఆపైన ముగింపు అనేవి ఉండాలనీ, అవి ఒకదాన్నుండి మరొకదానికి క్రమంగా సహజం గా ప్రయాణించి, ఆఖరు న ముగింపులో భావం culminate కావాలనీ కొందరు విమర్శకులు చెప్పివున్న సంగతి వాస్తవమే. కానీ ఈ నిర్దిష్ట నమూనాను (fixed pattern ను) ప్రతి కవీ అనుసరించాలా? ఇట్లాంటి అకడమిక్ ప్రతిపాదనలు కవుల స్వేచ్ఛను హరిస్తాయి. ప్రారంభదశలో ఉన్న కవులకోసం ఐతే ఈ సూచనలు సరైనవే కావచ్చు కాని, ఎదిగిన కవులు తప్పకుండా అనుసరించతగినవి అని కరాఖండిగా చెప్పలేం. కానీ నిజానికి ఈ కవితలో అట్లాంటి ప్రణాళికా పరమైన నిర్మాణం లేదని చెప్పలేము. ప్రారంభంలో కూ తురు కవి దగ్గరికి రావడాన్ని కవితలోకి ఎంట్రీగా తీసుకోవచ్చు. మధ్యభాగంలో కవి మనసులో చెలరేగిన అల్లకల్లోలం వర్ణించబడింది. చివర్న దాని పర్యవసానం సూచితమైంది.
ఈ కవితలో కవి నిద్ర పోలేకపోవడానికి ముఖ్యకారణం, అతనికీ కూతురుకూ మధ్య ఉన్న అనురాగ బంధం వెల్లువై హృదయాన్ని ముంచేసి, అత న్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే. కానీ ఈ వివరణను కవి categoricalగా (కచ్చితంగా) ఆమోదిస్తాడనే గ్యారంటీ ఏం లేదు. అతని ఉద్దేశం కొంచెం భిన్నంగా ఉన్నా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు.
ఎలనాగ: 98669 45424