కీవ్: రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. పుతిన్తో తాను చర్చలకు సిద్ధమేనని ఆయన తెలిపారు. పుతిన్, తన మధ్య జరిగే చర్చలు ఒకవేళ విఫలమైతే, ఇక మూడో ప్రపంచ యుద్ధమే అని అన్నారు. గత రెండు ఏండ్లుగా చర్చలకు తాను సిద్ధంగానే ఉన్నానని జెలెన్స్కీ తెలిపారు. చర్చలు జరుగకుండా ఈ యుద్ధం ముగియదని అన్నారు. ఈ నేపథ్యంలో ఏదో విధంగా పుతిన్తో తాను చర్చలు జరుపాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని జెలెన్స్కీ వ్యాఖ్యానించినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.
మరోవైపు ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ఆదివారం నాటికి 25వ రోజుకు చేరింది. అయితే ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 14,700 మంది రష్యా సైనికులు హతమయ్యారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. 96 రష్యా యుద్ధ విమానాలు, 118 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు చెప్పింది. 1,487 సాయుధ వాహనాలు, 947 సైనిక వాహనాలు, 476 ట్యాంకులు, 74 ఎంఎల్ఆర్లు, 60 ట్రక్కులు, 44 యాంటీ ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలు, 21 యూఈవీలు, 12 ప్రత్యేక పరికరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది.
కాగా, రష్యా యుద్ధం నేపథ్యంలో సుమారు పది లక్షల మంది ప్రజలు ఉక్రెయిన్ను వీడినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. వినాశకరమైన యుద్ధానికి బాధ్యులైన వారి వల్ల అమాయక పౌరులు బలవంతంగా తమ ఇండ్లను వీరి శరణార్థులుగా మారుతున్నారని యూఎన్హెచ్సీఆర్ చీఫ్ ఫిలిప్పో గ్రాండి ఆవేదన వ్యక్తం చేశారు.