హైదరాబాద్: కామిడీ హీరో నుంచి దేశాధ్యక్షుడిగా జెలెన్స్కీ అవతరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ప్రపంచం అంతా ఫోకస్ పెట్టింది. జెలెన్స్కీని రాజకీయం వైపు మళ్లించిన ఓ సెటైర్ కామిడీ సిరీస్ను ఇప్పుడు నెట్ఫ్లిక్స్ మళ్లీ ప్రసారం చేస్తోంది. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ సిరీస్ను అమెరికా నెట్ఫ్లిక్స్లో ప్రసారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ సిరీస్ 2017 నుంచి 2021 వరకు ప్రసారం అయ్యింది. ఆ సిరీస్నే ఇప్పుడు అమెరికాలో మరోసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు.
సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ సిరీస్లో జెలెన్స్కీ ఓ టీచర్ పాత్ర పోషిస్తాడు. అయితే కొన్ని కారణాల వల్ల దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అవినీతిపై చేసిన ఓ ప్రసంగం సోషల్ మీడియాలో అతన్ని పెద్ద స్టార్ను చేసేస్తుంది. దీంతో జెలెన్స్కీ దేశాధ్యక్షుడవుతారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో జెలెన్స్కీ రాజకీయాల వైపు మళ్లడానికి ఆ షో కీలకంగా నిలిచింది. మూడు సీజన్ల పాటు ఆ సిరీస్ ప్రసారం అయ్యింది. ఆ తర్వాత 2019లో నిజంగానే దేశాధ్యక్ష ఎన్నికల్లో జెలెన్స్కీ పోటీపడ్డారు. కొత్త పార్టీతో పేరుతో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు.
స్వీడన్కు చెందిన టెలివిజన్ గ్రూపు ఎక్కో రైట్స్ సంస్థకు ఈ సిరీస్కు సంబంధించిన లైసెన్సు ఉంది. నిజానికి ఆ సిరీస్ ఓ కామిడీ షో అని, కానీ జెలెన్స్కీ జీవితంలో అదో కీలక మైలురాయి అవుతుందని సంస్థ తెలిపింది. సాధారణ వ్యక్తి దేశాధ్యక్షుడు కావడం, ఆ తర్వాత ప్రజల మనుసు దోచుకున్న రీతిలో షోను నడిపించారు. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితుల్లో జెలెన్స్కీ భిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ షోను జనం ఆదరించినా.. ప్రస్తుతం జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ దేశాన్ని నరకంలోకి పడేశాయి.