టెహ్రాన్: హిజాబ్ ధరించనందుకు ఇరాన్కు చెందిన ఒక యువతిని ఆ దేశ ‘నైతిక పోలీసులు’ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న ఆ మహిళ మూడు రోజుల తర్వాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సంఘటనపై ఇరాన్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 22 ఏళ్ల మహ్సా అమిని తన కుటుంబంతో కలిసి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సందర్శనకు వెళ్లింది. ఆ దేశ మహిళలు కఠినమైన దుస్తుల కోడ్ పాటించేలా బాధ్యత వహించే పోలీసులు ఆమె హిజాబ్ ధరించకపోవడాన్ని గమనించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ యువతిని అరెస్ట్ చేశారు. అయితే నైతిక పోలీసుల కస్టడీలో ఉన్న ఆమె మూడు రోజుల తర్వాత కోమాలోకి వెళ్లింది. ఆసుపత్రికి తరలించగా ఆ మహిళ చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, ఈ సంఘటన ఇరాన్తోపాటు ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ముస్లిం మహిళల డ్రెస్ కోడ్ పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసులు ఆమెను చిత్రహింసలకు గురి చేశారని, తలపై కొట్టడంతో ఆ యువతి కోమాలోకి వెళ్లి చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులతోపాటు కొన్ని వార్తా సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు నిరసనకు దిగారు. ఆ యువతి మరణానికి కారణమైన పోలీసులను చట్టం ప్రకారం శిక్షించాలని నినాదాలు చేశారు.
మరోవైపు ప్రపంచ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఇరాన్లోని అమెరికా ప్రతినిధులు కూడా ఈ సంఘటనను ఖండించారు. చిత్రహింసలకు గురిచేసి యువతి మరణానికి కారణమైన వారిని న్యాయవ్యవస్థ ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.