బీజింగ్, అక్టోబర్ 23: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి ఎన్నికై.. ఆ ఘనత సాధించిన ఏకైక నాయకుడిగా అవతరించారు. అంతేకాదు.. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ కంటే ఎక్కువకాలం చైనాను పాలించిన నేతగా కూడా రికార్డు సృష్టించబోతున్నారు. జిన్పింగ్ను చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) జనరల్ సెక్రటరీగా పార్టీ స్టాండింగ్ కమిటీ ఆదివారం ఎన్నుకొన్నది. సీపీసీ అధినేతే చైనా అధ్యక్షుడిగా కొనసాగుతారు. 20వ సీపీసీ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసాంతం జిన్పింగ్ కనుసన్నల్లోనే సాగాయి. శనివారం పార్టీ సెంట్రల్ కమిటీని ఎన్నుకొన్నారు. 300 మంది ఉండే సెంట్రల్ కమిటీ పార్టీ పొలిటికల్ బ్యూరో సభ్యులుగా 25 మందిని ఆదివారం ఎన్నుకొన్నది. ఆ వెంటనే అందులోంచి ఏడుగురిని స్టాండింగ్ కమిటీలోకి ఎన్నుకొన్నారు. ఆ ఏడుగురిలో నుంచి జిన్పింగ్ను మళ్లీ అధ్యక్షుడిగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నుకోవటం సాఫీగా సాగిపోయింది. జిన్పింగ్ 2012 నుంచి చైనా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ ఏడాదితో పదేండ్ల పాలన పూర్తవుతుంది. కమ్యూనిస్టు చైనా వ్యవస్థాపకుడు మావోను జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకొన్నప్పటికీ పదేండ్లే చైనాను పాలించారు. కాగా, పార్టీ సమావేశాల నుంచి శనివారం మాజీ అధ్యక్షుడు హు జింటావోను అర్ధాంతరంగా బయటకు తీసుకెళ్లిన విషయంపై చైనా మీడియా వివరణ ఇచ్చింది. ఆయన అస్వస్థతకు గురికావటం వల్లే విశ్రాంతి గదికి తరలించారని జిన్హువా వార్తా సంస్థ ట్వీట్ చేసింది.