బీజింగ్: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు సెరిబ్రల్ ఎనరిజం వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో గత ఏడాది చివరలో ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చైనీయులు సాంప్రదాయ వైద్య చికిత్సను పొందుతున్నారు. సర్జరీకి బదులుగా ఆయన ట్రెడిషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. దీని ద్వారా మెదడులోని రక్తపునాళాలు మెత్తబడి వ్యాధి తగ్గే అవకాశాలు ఉన్నాయి. సెరిబ్రల్ ఎనరిజం అనగా మెదడులోని ధమనుల్లో వాపు రావడం. ఈ వ్యాధి వల్లే ఆయన గత కొన్నాళ్ల నుంచి విదేశీ నేతలను కలవడం లేదు. కోవిడ్19 మహమ్మారి వ్యాప్తి చెందిననాటి నుంచి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ అయ్యే వరకు ఆయన అన్ని సమావేశాలకు దూరంగా ఉన్నారు.
2019లో ఇటలీ టూర్కు వెళ్లిన సమయంలో ఆయన నడక కాస్త తడబాటు కనిపించింది. ఫ్రాన్స్ టూర్ సమయంలోనూ జిన్పింగ్ నడిచేందుకు ఇబ్బందిపడ్డారు. కూర్చోవడానికి కూడా ఆయన సపోర్ట్ తీసుకున్నారు. 2020 అక్టోబర్లో షెంజెన్లో ప్రసంగిస్తున్న సమయంలో ఆయన విపరీతంగా దగ్గారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు ఆయన మూడోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని భావిస్తున్న విషయం తెలిసిందే.