జెనీవా, జూన్ 17: కొవిడ్ టీకాలపై పేటెంట్లు తాత్కాలికంగా రద్దు, సముద్ర జలాల్లో పరిమితికి మించి చేపల వేటపై సబ్సిడీల ఎత్తివేత, ఆహార భద్రత తదితర ఆంశాలపై ప్రపంచ వాణిజ్యసంస్థ(డబ్ల్యూటీవో) సభ్య దేశాల మధ్య శుక్రవారం ఒప్పందం కుదిరింది. జెనీవాలో జరిగిన 12 మినిస్టీరియర్ కాన్ఫరెన్స్లో 164 సభ్య దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నాలుగు రోజుల విస్తృత చర్చల అనంతరం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. కొవిడ్ టీకాపై పేటెంట్లు తొలగింపు ఐదేండ్ల పాటు అమల్లో ఉంటుంది. దీంతో అభివృద్ధి చెందుతున్న దేశాలు టీకాలను ఉత్పత్తి చేసి సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది.
మంచి ప్యాకేజీ
అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిమితికి మించి చేపల వేటకు సంబంధించిన చర్చ 20 ఏండ్లుగా సాగుతున్నది. ఈ అంశంలో ప్రపంచదేశాల మధ్య వాణిజ్యానికి హాని కలిగించే సబ్సిడీలను ఎత్తివేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉంది. తాజా జెనీవా కాన్ఫరెన్స్లో దీనికి ఆమోదం లభించింది. కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కేంద్రం వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూశ్ గోయల్ విలేకరులతో మాట్లాడారు. ‘భారత జాలర్ల హక్కులను ప్రభుత్వం ఎప్పుడూ కాపాడుతుంది’ అన్నారు. ‘మొత్తంగా చూస్తే ఇది మంచి ప్యాకేజీ’ అని వ్యాఖ్యానించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ గూడ్స్ కస్టమ్ డ్యూటీలపై మారటోరియానికి వచ్చే మినిస్టీరియల్ కాన్ఫరెన్స్లో పరిష్కారం కనుక్కోవాలని డబ్ల్యూటీవోలో అంగీకారం కుదిరింది. 2024 మార్చిలోగా మళ్లీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.