వందలాది మందిని తొలగిస్తున్న కంపెనీలు
వడ్డీ రేట్లు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులే కారణం
సింగపూర్, జూన్ 25: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, అధిక వడ్డీ రేట్లు ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లోని పలు స్టార్టప్ కంపెనీలు గత కొన్ని నెలలుగా వందలాది మంది ఉద్యోగులు, కార్మికులను తొలగిస్తున్నాయి. ఇది ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరింతగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగపూర్కి చెందిన ఈ-కామర్స్ సైట్ షాపీతో సహా ఆరు టెక్ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయి. షాపీ సంస్థ తన ఫుడ్ డెలివరీ, పేమెంట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్రిష్ ఫెంగ్ ఆయా బాధిత ఉద్యోగులకు మెయిల్ పంపారు. ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వలన కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని అందులో పేర్కొన్నారు.
మలేషియా ఆన్లైన్ షాపింగ్ సంస్థ ‘ఐప్రైస్’ జూన్లో 250 మందిలో ఐదో వంతును తొలగించింది. ఇండోనేషియా ఎడ్యుకేషన్ టెక్ కంపెనీ జీనియస్ 200 మందిని, సింగపూర్కి చెందిన క్రిప్టో.కామ్ కూడా 260 మందిని తొలగించింది. ఇంకా సీ లిమిటెడ్, స్టాష్అవే వంటి సంస్థలు కూడా ఉద్యోగులను ఫైర్ చేశాయి. వెంచర్ క్యాపటలిస్ట్ సంస్థ ఓపెన్స్పేస్లో భాగస్వామి అయిన జెస్సికా హువాంగ్ మాట్లాడుతూ తక్కువ వడ్డీతో వచ్చే రుణాల కారణంగా ‘చీప్ మనీ’ గత ఏడాది మార్కెట్లోకి ఇబ్బడిముబ్బడిగా వచ్చిందని, సంస్థలు ఉద్యోగులను భారీయెత్తున నియమించుకున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు సమస్యలు వచ్చేసరికి ఉద్యోగులను తొలగిస్తున్నారని అన్నారు. రానున్న నెలల్లో మరింతగా చూస్తామని హెచ్చరించారు.