వాషింగ్టన్: చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసే ఇద్దరు కార్మికులు ప్రమాదవశాత్తు చాక్లెట్ ట్యాంక్లో పడ్డారు. నడుము లోతు చాక్లెట్ ట్యాంకులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది శ్రమించాల్సి వచ్చింది. అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ సంఘటన జరిగింది. ఎల్జిబెత్ టౌన్లోని మార్స్ చాక్లెట్ ఫ్యాక్టరీలో పని చేసే ఇద్దరు వర్కర్లు గురువారం మధ్యాహ్నం చాక్లెట్ తయారీ ట్యాంక్లో పడి చిక్కుకున్నారు. ఈ సంఘటనపై ఎమర్జెన్సీ నంబర్ 911కు సమాచారం అందింది.
స్పందించిన ఫైర్, అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఆ ఫ్యాక్టరీకి చేరుకున్నారు. చాక్లెట్ ట్యాంకులో పడిన ఇద్దరు కార్మికులను రక్షించేందుకు సిబ్బంది కష్టపడాల్సి వచ్చింది. వారిద్దరూ నడుపు లోతు మేర చాక్లెట్ ఉన్న ట్యాంకులో పడ్డారు. దీంతో వారిని నేరుగా బయటకు తీయడం సాధ్యం కాలేదు. చివరకు ఆ చాక్లెట్ ట్యాంక్కు హోల్ పెట్టారు. దాని నుంచి కొంత చాక్లెట్ మిశ్రమాన్ని తొలగించిన తర్వాత ఆ ఇద్దరు కార్మికులను బయటకు తీశారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
కాగా, ఆ ఇద్దరు కార్మికులు నడుము లోతున్న చాక్లెట్ ట్యాంకులో ఎలా పడ్డారన్నది తెలియలేదు. అమెరికాలోని ప్రముఖ చాక్లెట్ తయారీ సంస్థ అయిన మార్స్ కూడా ఈ సంఘటనపై ఇంకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు.