న్యూయార్క్: విమానంలో ప్రయాణిస్తున్న మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె చాలా భయపడిపోయింది. మిగతా ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఆ మహిళ విమానం టాయిలెట్లో ఐసొలేట్ అయ్యింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది. మిచిగాన్కు చెందిన టీచర్ ఫోటీయో, డిసెంబర్ 19న తన కుటుంబ సభ్యులతో కలిసి చికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానంలో ప్రయాణించారు. విమానం ఆకాశంలో ఉండగా గొంతులో మంటతో ఆమె ఇబ్బంది పడ్డారు. దీంతో విమానంలోని బాత్రూమ్కు వెళ్లారు. తన వద్ద ఉన్న కిట్తో కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్గా తేలింది. దీంతో ఆమె చాలా ఆందోళన చెందారు. భయంతో అక్కడే ఏడ్చారు.
గమనించిన ఫ్లైట్ అటెండెంట్ రాకీ, వెంటనే ఫోటీయో వద్దకు వెళ్లారు. విషయం తెలుసుకుని ఆమెను సముదాయించారు. ఆ మహిళ సీటును మార్చేందుకు ఫ్లైట్ అటెండెంట్ ప్రయత్నించారు. అయితే విమానంలో ప్రయాణికులు నిండుగా ఉండటంతో సీట్లు ఖాళీగా లేవు. ఫ్లైట్ అటెండెంట్ రాకీ ఈ విషయాన్ని ఫోటీయోకు చెప్పారు. మిగతా ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని టాయిలెట్లోనే ఆమె ఐసొలేట్ అయ్యారు. దీంతో ఆ టాయిలెట్ పని చేయడం లేదంటూ నోటీస్ ఉంచారు. మిగతా ప్రయాణమంతా ఆమె ఆ టాయిలెట్లోనే ఉన్నారు.
ఐర్లాండ్లో విమానం ల్యాండ్ కాగా ఫోటియో, ఆమె తండ్రి, సోదరుడు చివరగా దిగారు. తండ్రి, సోదరుడికి కరోనా టెస్ట్లో నెగిటివ్ రావడంతో కనెక్ట్ విమానంలో స్విట్జర్లాండ్ వెళ్లారు. ఫోటియోకు విమానాశ్రయంలో మరోసారి రాపిడ్తోపాటు ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్ష నిర్వహించగా రెండింటిలో పాజిటివ్గా వచ్చింది. దీంతో హోటల్కు తరలించి పది రోజులు క్వారంటైన్లో ఉంచారు.