ఎడిన్బర్గ్: స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్కు చెందిన ఓ మహిళ తన ఇంటి ఫ్రంట్ డోరుకు పింక్ కలర్ వేసింది. అయితే ఆ రంగు వేసినందుకు ఆ నగర మున్సిపాలిటీ ఆమెకు 19 లక్షల జరిమానా విధించింది. 48 ఏళ్ల మిరిండా డిక్సన్ అనే మహిళ తన ఇంట్లో ఉన్న ముందు డోరుకు పింక్ కలర్ వేయడంతో స్థానిక మున్సిపాల్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సిటీ కౌన్సిల్ ప్లానర్స్ పింక్ రంగు డోర్ను మార్చాలని సూచించారు.
2019లో ఆ మహిళ ఆ ఇంటిని ఖరీదు చేసింది. దానికి మరమ్మత్తులు చేస్తూ.. ఫ్రంట్ డోర్కు తనకు నచ్చిన పింక్ కలర్ వేసింది. బ్రిస్టల్, నాటింగ్ హిల్, హర్రోగేట్ నగరాల్లో ఉన్న బ్రైట్ కలర్స్ చూసి ఆమె తన ఇంటి డోర్కు పింక్ కలర్ వేసుకున్నది. కానీ సిటీ రూల్స్ ప్రకారం ముందు డోర్లకు కేవలం వైట్ కలర్ మాత్రమే వేయాలి. అయితే పింక్ వేయడం వల్ల ఆ డోర్ ఫేమస్ అయ్యింది. ఆ వీధి మీదుగా వెళ్తున్న వాళ్లు ఆ డోర్ వద్ద ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం వైరల్గా మారింది.
ఎడిన్బర్గ్ కౌన్సిల్ ఆ డోర్ కలర్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది. డోర్ కలర్ మార్చాలని ఆదేశించింది. ఒకవేళ వైట్ కలర్ వేయకుంటే, 20 వేల పౌండ్లు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నది.