సాయ్ పౌలో : బంగీ జంప్ నిర్వాహకుల నిర్లక్ష్యం ఓ యువతి ప్రాణాలను బలిగొన్నది. తాడు కట్టకుండానే యువతిని 130 అడుగుల ఎత్తు నుంచి విసిరివేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్లో శనివారం ఈ ఘటన జరిగింది. మృతురాలిని మరియా ఎడ్యుర్డా రొడ్రిగస్ డి ఫ్రీటస్గా గుర్తించారు. స్టేట్ ఆఫ్ సాయ్ పౌలోలోని స్కెలిటన్ వంతెన మీద ఓ ప్రైవేట్ కంపెనీ నిర్వహించిన బంగీ జంప్లో ఈ దుర్ఘటన జరిగింది. ఆమెను కిందకు వదిలివేయడానికి ముందు నిర్వాహకులు ఆమె కాళ్లకు తాడు కట్టడం మరిచిపోయారు.
ఆ విషయం గుర్తించకుండానే ఆమెను కిందకు తోశారు. ఇది గుర్తించిన ప్రత్యక్ష సాక్షులు ‘అయ్యో తాడు లేదు’ అని అరిచారు. కానీ ఆమెకు సాయం అందించే లోపే ఆమె కింద ఉన్న లోయలోకి పడి ప్రాణాలు విడిచింది. ఆమె బంగీ చేస్తున్నప్పుడు ఆమెకు కాబోయే భర్త అక్కడే ఉన్నారు. అయితే ఆమె మరణ వార్త విన్నాక అతడు అస్వస్థతకు గురయ్యాడు.