నారంజల్: ఈక్వెడార్లో ఓ మహిళా కౌన్సిలర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి(Councillor Shot Dead) చంపారు. గుయాస్ ప్రావిన్సులోని నారంజల్ సిటీలో ఉన్న అధ్వాన్న రోడ్ల గురించి వీడియో తీస్తున్న సమయంలో ఆమెపై అటాక్ జరిగింది. ఆ కాల్పుల్లో 29 ఏళ్ల కౌన్సిలర్ డయానా కార్నెరో ప్రాణాలు కోల్పోయింది. మోటర్సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కౌన్సిలర్ డయానా తలలో షూట్ చేశారు.
తక్షణమే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటి వరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలింపు చేస్తున్నట్లు తెలిపారు. పట్టపగలే రోడ్డు మీద కౌన్సిలర్ను కాల్చి చంపిన ఘటన దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది.
దేశంలో వ్యవస్థీకృత నేరాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో గత నెలలోనే అధ్యక్షుడు డానియల్ నోబోవా ఎమర్జెన్సీ ప్రకటించారు. రాత్రి 11 గంటల తర్వాత ఎవరు కనిపించినా ఖతం చేస్తామని గ్యాంగ్స్టర్లు కూడా ప్రకటించారు.