వాషింగ్టన్: తన తండ్రి 30 ఏళ్ల కాలంలో 70 మంది మహిళలను హత్య చేసినట్లు ఒక మహిళ ఆరోపించింది. మహిళల మృతదేహాలను పూడ్చడంలో తనతోపాటు తన పిల్లలు కూడా సహకరించినట్లు ఆ వ్యక్తి కుమార్తె న్యూస్వీక్కు తెలిపింది. దీంతో ఈ విషయం అమెరికాలో సంచలనం అయ్యింది. 75 ఏళ్ల వృద్ధుడు డోనాల్డ్ డీన్ స్టడీ 2013లో చనిపోయాడు. అయితే అతడు సీరియల్ కిల్లర్ అని కుమార్తె లూసీ స్టడీ ఆరోపించింది. ఒమాహా, నెబ్రాస్కాకు చెందిన చాలా మంది సెక్స్ వర్కర్లు, ఆకర్షణకు గురైన మహిళలను కొండ ప్రాంతంలోని ఫామ్హౌస్కు తీసుకు వచ్చేవాడని ఆ మహిళ తెలిపింది. అనంతరం వారిని హత్య చేసేవాడని, 30కు పైగా ఏళ్లలో సుమారు 70 మంది మహిళలను తన తండ్రి చంపినట్లు ఆమె ఆరోపించింది.
అయితే చాలా మంది మహిళ మృతదేహాలను ఫామ్ హౌస్ సమీపంలోని బావి వద్దకు తరలించి అందులో పడేసి చెత్తతో కప్పేసినట్లు లూసీ తెలిపింది. కొన్ని మృతదేహాలను ఆ పరిసర ప్రాంతంలో పాతిపెట్టినట్లు చెప్పింది. దీని కోసం తనతోపాటు తన పిల్లలు కూడా సహకరించినట్లు ఆమె వెల్లడించింది. ఆ ప్రాంతాన్ని తవ్వి మృతదేహాలను వెలికి తీయాలని లూసీ కోరింది. హత్యకు గురైన మహిళల మృతదేహాలకు సరైన రీతిలో అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె వేడుకుంది.
మరోవైపు తన తండ్రిపై లూసీ చేసిన ఆరోపణలు అమెరికాలో కలకలం రేపాయి. దీనిపై ఫ్రీమాంట్ పోలీసులు దృష్టిసారించారు. బావి ఉన్న ఆ ప్రాంతం వద్దకు జాగిలాలను రప్పించారు. అక్కడ మానవ అవశేషాలున్నట్లు ఆ కుక్కలు పసిగట్టాయి. అయితే దీనిని సాంకేతికంగా నిర్ధారించిన తర్వాత తవ్వకాలు జరుపుతామని పోలీసులు తెలిపారు.
ఒకవేళ మహిళల వరుస హత్యలు నిజమని తేలితే, అమెరికా చరిత్రలోనే సీరియల్ కిల్లర్గా డోనాల్డ్ డీన్ నిలుస్తాడని ఆ దేశ పోలీసులు పేర్కొన్నారు. అమెరికా సీరియల్ కిల్లర్, నరమాంస భక్షకుడు జెఫ్రీ డాహ్మెర్ 17 మందిని హత్య చేయగా, టెడ్ బండి అత్యధికంగా 36 మందిని చంపినట్లు అనుమానిస్తున్నారు.