ఏథెన్స్: గ్రీస్లో కార్చిర్చు ( Wildfires ) దావానలంలా వ్యాపిస్తూనే ఉన్నది. అడవులతోపాటు అటవీ సమీప ప్రాంత గ్రామాల్లోని ఆవాసాలను సైతం కార్చిర్చు దహించి వేస్తున్నది. దాంతో ఇప్పటికే వేలాది కుటుంబాలు రోడ్లపైకి వచ్చాయి. తాము కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే అగ్నికీలల్లో ఆహుతైపోతుంటే ప్రజలు నిస్సహాయంగా ఉండిపోయారు. చేసేదేమీ లేక లేక ప్రభుత్వం ఏర్పాటు చేయించిన పునరావాస కేంద్రాల్లో కాలం వెళ్లదీస్తున్నారు.
గత కొన్ని రోజులుగా గ్రీస్లో కార్చిర్చు చెలరేగుతున్నది. అయితే శనివారం ఇది మరింత ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 1,450 మంది అగ్నిమాపక సిబ్బంది విమానాల్లో వెళ్లి మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా, కాలిబూడిదైన తమ ఆవాస ప్రాంతాల్లోకి ఇప్పట్లో తాము వెళ్లే పరిస్థితులు కనిపించడం లేదని, బహుశా భవిష్యత్తులో మా మునిమండ్లు వెళ్తారేమోనని కొందరు బాధితులు విలపిస్తున్నారు. దీన్నిబట్టి అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, కార్చిచ్చుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రీస్కు అండగా నిలిచేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, ఈజిప్టు, స్పెయిన్ దేశాలు ముందుకు వచ్చాయి. గ్రీస్లో గత 10 రోజుల వ్యవధిలో 56,655 హెక్టార్ల విస్తీర్ణంలో అడవులు కాలిబూడిదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతలు, భారీ గాలుల నేపథ్యంలో మంటలు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఈ మంటల కారణంగా గ్రీస్లో ఇద్దరు చనిపోయారు. కానీ, ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది.