Diabetes | న్యూయార్క్: డయాబెటిక్ రోగుల్లో గాయాలు అంత త్వరగా నయం కావు. ఇందుకు గల కారణాలను అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. ఎక్సోసోమ్స్ అనే కణాల కారణంగానే డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల్లో ఈ పరిస్థితి తలెత్తుతుందని వారు వెల్లడించారు. పెన్సిల్వేనియాలోని యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్, యూపీఎంసీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పిట్స్బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శుభదీప్ ఘటక్, యూపీఎంసీ పరిశోధకుడు డా.చందన్ సేన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు జరిగాయి. పరిశోధనల్లో భాగంగా 22 మంది డయాబెటిక్ రోగులు, 15 మంది నాన్-బయాబెటిక్ వ్యక్తుల గాయాలకు సంబంధించిన ద్రవాలను సేకరించారు.
ఈ ద్రవాలపై అధ్యయనం చేసి డయాబెటిక్ రోగుల్లో అనవసరమైన ఎక్సోసోమ్స్ కణాలు ఉన్నట్టు గుర్తించారు. సాధారణ వ్యక్తుల్లో కణాల మధ్య సంకేతాలను పంపించి గాయాలను మాన్పడంలో ఈ ఎక్సోసోమ్స్ కీలకపాత్ర పోషిస్తాయి. కెరటినోకైట్స్ విడుదల చేసే ఈ ఎక్సోసోమ్స్ అందించే సంకేతాల ఆధారంగా మాక్రోఫేజులు వ్యవస్థల మధ్య సమన్వయం చేసుకుంటూ గాయాన్ని మాన్పుతాయి. అయితే డయాబెటిక్ రోగుల్లో డయాఎక్సోసోమ్స్గా పిలిచే అనవసర ఎక్సోసోమ్స్ ఉంటాయి. ఇవి గాయాలను మాన్పేలా సంకేతాలను అందించలేవు. ఈ కారణంగానే డయాబెటిక్ రోగుల్లో గాయాలు త్వరగా మానవని పరిశోధకులు తేల్చారు.