రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుటుంబీకులందర్నీ అత్యంత సురక్షితమైన బంకర్లలోకి పంపించేసినట్లు తెలుస్తోంది. అణ్వాయుధాలతో ఈ బంకర్లపై దాడులు చేసినా.. కుటుంబీకులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లనంత పటిష్ఠమైన అండర్గ్రౌండ్ బంకర్లలో పంపించారని సమాచారం. ఈ సీక్రెట్ బంకర్లు సైబీరియాలో ఉన్నట్లు రష్యాకు చెందిన ఓ ప్రొఫెసర్ పేర్కొంటున్నారు. ఉక్రెయిన్కు ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరగడం, రష్యాతో ఉక్రెయిన్ ప్రతిఘటిస్తున్న నేపథ్యంలో పుతిన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.
మాస్కోకు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కు చెందిన రహే వాలెరీసోలోవీ అనే ప్రొఫెసర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక వేళ పరమాణు యుద్ధమంటూ వస్తే.. వారి కుటుంబీకులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశ్యంతోనే పుతిన్ ఈ సీక్రెట్ బంకర్లను ఎంచుకున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే సైబీరియాలోని ఏ ప్రాంతంలో వీరిని దాచారన్నది పుతిన్ అత్యంత గోప్యంగా ఉంచుతున్నారని ఆయన తెలిపారు.
అత్యంత విలాసవంతమైన బకర్లు…
సైబీరియాలోని అల్తాయీ పర్వత సానువుల్లో ఈ బంకర్లు ఉన్నట్లు కొందరు అంచనా వేస్తున్నారు. ఈ బంకర్లు అత్యంత విలాసవంతమైన, అత్యాధునిక సాంకేతికతతో కూడిన బంకర్లని సమాచారం. అణ్వాయుధాలతో దాడులు చేసినా… ఈ బంకర్లకు వీసమెత్తు నష్టం కూడా వాటిల్లదట. పుతిన్ కేవలం వారి కుటుంబీకుల కోసమే ఈ బంకర్లను తయారు చేయించినట్లు తెలుస్తోంది.