ఇస్లామాబాద్: అల్ ఖాదిర్ ట్రస్టు కేసు(Al-Qadir Trust case)లో ఇమ్రాన్ ఖాన్ను అరెస్టు చేశారు. యూనివర్సిటీకి జరిగిన భూ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రియల్ ఎస్టేట్ టైకూన్ మాలిక్ రియాజ్ వాంగ్మూలాన్ని గతంలో తీసుకున్నారు. నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో ఈ కేసును విచారిస్తున్నది. రెండు కేసుల్లో బెయిల్ దరఖాస్తు చేసుకున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టుకు వెళ్లారు. అయితే బయోమెట్రిక్స్ వివరాలు సమర్పిస్తున్న సమయంలో ఇమ్రాన్ను అదుపులోకి తీసుకున్నారు.
అల్ ఖాదిర్ వర్సిటీకి భూమి కేటాయించినప్పుడు పాక్ ప్రధానిగా ఇమ్రాన్ ఉన్నారు. ఈ కేసులో మంత్రులు జుల్ఫికర్ బుకారీ, మాజీ అడ్వైజర్ షెహజాద్ అక్బర్లు కూడా ఉన్నారు. బ్రిటన్లో సీజ్ చేసిన 50 బిలియన్ల అమౌంట్ను పాకిస్థాన్లో అందజేసే అంశంపై రియాజ్తో ఒప్పందం కుదురింది. ఆ ఒప్పందం ప్రకారం అల్ ఖాదిర్ వర్సిటీ ట్రస్టుకు భూముల్ని అప్పగించినట్లు తెలుస్తోంది. తొలుత భూమిని బుకారీ పేరిట ట్రాన్స్ఫర్ చేసి, ఆ తర్వాత ఆ భూమిని ట్రస్టుకు బదిలీ చేశారు.
వర్సిటీకి భూమి అప్పగించిన కేసులో గతంలో టైకూన్ మాలిక్ రియాజ్కు ఎన్ఏబీ నోటీసులు జారీ చేసింది. ఒప్పందం ప్రకారం సుమారు 57 ఎకరాల భూమిని అల్ ఖాదిర్ ట్రస్టుకు డొనేట్ చేశారు. అల్ ఖాదిర్ వర్సిటీ తరపున బుష్రా ఖాన్, డోనార్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ వర్సిటీకి ఇమ్రాన్ ఖాన్ చైర్మెన్గా ఉన్నారు. అయితే ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలోనే ఈ ఒప్పందం జరగడంతో దాంట్లో దాగిన అవినీతి బయటపడింది.
జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు వర్సిటీ ట్రస్టుకు సుమారు 180 మిలియన్ల పాక్ కరెన్సీ డొనేషన్ రూపంలో వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇమ్రాన్ వల్ల జాతీయ ఖజానాకు రూ.50 బిలియన్ల నష్టం జరిగినట్లు మంత్రి రాణా సనావుల్లా ఆరోపించారు.