టోక్యో, ఆగస్టు 14: మానవుడు కూడా ఒక జంతువు అనే విషయం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అయితే మిగిలిన జంతువులకు మానవులకు చాలా తేడాలున్నాయి. అందులో ఒకటి మాట్లాడం… ఇలా మాటలు రావడానికి మన స్వర పేటికలో కాలక్రమంలో చాలా మార్పులు జరిగాయి. అవి ఎలా జరిగాయో తాజా అధ్యయనంలో పరిశోధకులు గుర్తించారు. ఇందుకోసం 43 రకాల జాతి కోతుల స్వరపేటికలను పరీక్షించారు. స్వర త్వచం అనేది మనుషుల్లో మాత్రమే ఉన్నదని, వేరే జంతువులు, కోతుల్లో లేదని తెలుసుకున్నారు.
స్వర తంతువులకు కొనసాగింపుగా చిన్న రిబ్బన్ వంటి నిర్మాణమే స్వర త్వచం. మరోవైపు చూస్తే కోతుల్లాగా మనుషులు గట్టిగా అరవలేరని కూడా గుర్తించారు. దీనికి కారణం కోతుల్లో ఉండేటి బెలూన్ వంటి వాయుకోశాలు మానవుల్లో ఉండకపోవడమే. ఈ వాయు కోశాలు లేకపోవడం వల్లే మానవుడు మాట్లాడే శక్తిని అభివృద్ధిపరుచుకున్నాడు.
మానవులు కాకుండా వేరే జంతువుల్లో గొంతులో నిర్మాణాలు చాలా గందరగోళంగా ఉండటం వల్లే అవి మాట్లాడే సామర్థ్యాన్ని ఏర్పరచుకోలేదని జపాన్లోని క్యోటో యూనివర్సిటీలో సెంటర్ ఫర్ ఎవల్యూషనరీ ఆరిజిన్స్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్లోని ప్రైమేటాలజిస్టు టకేషి నిషిమురా వివరించారు. ఈ అధ్యయనం వివరాలను ‘సైన్స్’ జర్నల్లో ప్రచురించారు. చింపాంజీలు, గొరిల్లాలు, ఒరంగుటాన్స్, గిబ్బన్ తదితర కోతి జాతులతో పాటు మాకాక్స్, బబూన్స్, మాండ్రిల్స్, కాపుచిన్స్, టామరిన్స్, మార్మోసెట్స్, టిటిస్ వంటి వాటిపై ఈ అధ్యయనం జరిపారు.