కరోనా మృతులపై డబ్ల్యూహెచ్వో వెల్లడి
ఐరాస, మే 21: ప్రపంచవ్యాప్తంగా గతేడాది కరోనాతో 30 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అంచనా వేసింది. అధికారిక గణాంకాల కంటే ఇది రెట్టింపు అని పేర్కొన్నది. కరోనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంభవించిన అనేక మరణాలు నమోదు కాలేదని శుక్రవారం వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 31నాటికి ప్రపంచవ్యాప్తంగా 8.2 కోట్ల మంది వైరస్బారినపడగా, 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ప్రత్యక్షంగా, పరోక్షంగా మరణించినవారిని కలుపుకుంటే మృతుల సంఖ్య 30 లక్షలకంటే పైనే ఉంటుందని డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. అధికారిక గణాంకాల కంటే ఇది 12 లక్షలు అధికమని తెలిపింది. అన్ని దేశాలూ సమగ్రంగా సమాచారాన్ని సేకరించాలని కోరింది. కొన్ని దేశాలు దవాఖానలో మరణించినవారినే లెక్కిస్తున్నాయని, దవాఖానల వెలుపల మృతిచెందినవారిని పరిగణనలోకి తీసుకోవట్లేదని పేర్కొన్నది. వైద్య సేవలు అందక, ఇతరత్రా కారణాలతో అనేక మంది మరణించారని తెలిపింది. వైద్య సమాచార వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయని మహమ్మారితో తేటతెల్లమయిందని వివరించింది.