మాస్కో: మహాభీకరంగా సాగిన మరియపోల్ ఆక్రమణ దాదాపు ముగిసింది. ఆ తీర ప్రాంత నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. కానీ అజోవ్స్తల్ స్టీల్ ప్లాంట్ను మాత్రం వదిలివేస్తున్నట్లు రష్యా పేర్కొన్నది. ఆ స్టీల్ ప్లాంట్లో ఉక్రెయిన్ తరపున పోరాడుతున్న ఫైటర్లు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు అనేక మంది సాధారణ జనం కూడా ఉన్నట్లు సమాచారం. ఆ స్టీల్ ప్లాంట్పై దాడి చేయవద్దు అని తాజాగా పుతిన్ ఆదేశించారు. కానీ ఆ ప్లాంట్ను పూర్తిగా సీజ్ చేయాలని, ఒక్క పురుగు కూడా బయటకు వెళ్లొద్దు అని అల్టిమేటమ్ జారీ చేశారు. దీంతో అజోవ్ ప్లాంట్లో ఎవరు దాగి ఉన్నారన్నది ఆసక్తిగా మారింది.
అజోవ్ యూరోప్లోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్. నాలుగు చదరపు మైళ్ల విస్తీరణంలో ఆ ప్లాంట్ ఉంది. మరియపోల్లో రష్యా సైనికులతో చివర వరకు పోరాడుతున్న ఏకైక ప్రాంతం అదే. ఆ ప్లాంట్లో ఉన్న ఫైటర్లు 36వ మెరైన్ బ్రిగేడ్కు చెందినట్లు తెలుస్తోంది. మెరైన్ బ్రిగేడ్ కమాండర్ మేజర్ సెర్హి వొలినా బుధవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. తమ దళాలు లొంగిపోవని ఆయన తేల్చి చెప్పారు. కానీ అంతర్జాతీయ సహాయాన్ని కోరారు. స్టీల్ ప్లాంట్లో 500 మంది సైనికులు గాయపడి ఉన్నారని, వందల సంఖ్యలో మహిళలు, చిన్నారులు దాక్కుని ఉన్నట్లు కూడా చెప్పారు. నిజానికి ఆ బ్రిగేడ్లోని కొంత మందిని రష్యా పట్టుకున్నది. కొందరు ఆయుధాలను వదిలి వెళ్లారు.
స్టీల్ ప్లాంట్లో అజోవ్ బ్రిగేడ్ అనే మరో దళం కూడా ఉంది. నల్ల సముద్రాన్ని, మరియపోల్ను కలిసే అజోవ్ నది పేరుతో ఆ దళాన్ని ఏర్పాటు చేశారు. అజోవ్ ఓ మిలిటెంట్ సంస్థ. అతివాద జాతీయవాదులతో దానికి లింకులు ఉన్నాయి. దీన్నే ఉక్రేనియన్ నేషనల్ గార్డ్గా మార్చేశారు. సుమారు 900 మంది అజోవ్ బ్రిగేడ్ ఆ ప్లాంట్లో ఉండి ఉంటుందని భావిస్తున్నారు. వారం క్రితమే మెరైన్తో పాటు అజోవ్ బ్రిగేడ్లు కలిసిపోయారు. నిజానికి ప్లాంట్లో ఎంత మంది సైనికులు ఉన్నారో చెప్పలేమని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగూ తెలిపారు. ఇటీవల మూడు ట్యాంక్లను, రెండు ఇన్ఫెంట్రీ ఫైటింగ్ వాహనాలను, సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు అజోవ్ దళం తన టెలిగ్రామ్ పోస్టులో తెలిపింది.
అజోవ్ ప్లాంట్పై ఆక్రమణ వద్దు అని పుతిన్ ఇచ్చిన ఆదేశాలతో కొందరు అయోమయానికి గురవుతున్నారు. కేవలం ఆ ప్లాంట్ను బ్లాక్ చేయాలని పుతిన్ తన తాజా ఆదేశాల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఒకవేళ పుతిన్ చెప్పినట్లే సైన్యం వింటే, మరి ఆ దేశం ఎందుకు ప్లాన్ మార్చిందో అర్థం కాకుండాపోతుంది. అయితే డాన్బాస్ ప్రాంతంపై దాడుల ఉదృతిని పెంచాలన్న ఉద్దేశంతో పుతిన్ ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ఉక్రెయిన్తో దౌత్యపరమైన చర్చల కోసం అజోవ్ ప్లాంట్ను పుతిన్ వదిలేసి ఉంటారని కొందరు అనుమానిస్తున్నారు.