న్యూయార్క్ : తాను క్యాన్సర్ బారినపడ్డానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు విస్మయానికి లోనవగా వైట్హౌస్ బైడెన్ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో కలకలం రేపిన అధ్యక్షుడి క్యాన్సర్ వ్యాఖ్యలపై వైట్హౌస్ స్పందించింది. దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు ఆయన చేయించుకున్న స్కిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ను ప్రస్తావించారని వైట్హౌస్ పేర్కొంది. బైడెన్ మసాచుసెట్స్లోని కోల్ మైన్ ప్లాంట్ను సందర్శించిన క్రమంలో తన బాల్యంలో తమ ఇంటి వద్ద ఉన్న ఆయిల్ రిఫైనరీల నుంచి వెలువడే వాయువులు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయనేది వెల్లడిస్తూ ఈ ప్రస్తావన చేశారని తెలిపింది.
దీంతో బైడెన్ క్యాన్సర్ బారినపడ్డారా లేదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో చర్చకు తెరలేచింది. గతంలోనూ బైడెన్ ఆరోగ్య అంశాలపై మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. తన బాల్యం గడిచిన డెలావర్లోని క్లెమాంట్లో ఆయిల్ రిఫైనరీలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయనేది బైడెన్ వెల్లడిస్తూ తమ తల్లి తమను నడవనీయకుండా తానే నడిపించేదని, ఆయిల్ రిఫైనరీల కారణంగా తనతో సహా ఆ ప్రాంతంలో ఎంతోమంది క్యాన్సర్ బారినపడ్డారని చెప్పారు. దేశంలోనే డెలావర్లో అత్యధిక క్యాన్సర్ రేటు ఉందని అన్నారు.
ఇక బైడెన్ క్యాన్సర్ గురించి మాట్లాడిన క్లిప్ను జోడిస్తూ జో బైడెన్ తనకు క్యాన్సర్ ఉందని ప్రకటించారా అంటూ ఆర్ఎన్సీ రీసెర్చ్ ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నలు రేకెత్తించింది. దీనిపై వాషింగ్టన్ పోస్ట్ చీఫ్ రైటర్ గ్లెన్ కెస్లర్ మండిపడ్డారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టేముందు బైడెన్ మెడికల్ రిపోర్ట్ పరిశీలించాలని సూచించారు. బైడెన్ నాన్-మెలనమ స్కిన్ క్యాన్సర్లను సర్జరీ ద్వారా తొలగించినట్టు రిపోర్ట్లో ఉందని చెప్పారు. ఇక అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ముందు బైడెన్ నాన్-మెలనొమ స్కిన్ క్యాన్సర్లను సర్జరీ ద్వారా తొలగించుకున్నాడని వైట్హౌస్ ప్రతినిధి వివరణ ఇచ్చినట్టు స్కైన్యూస్ తెలిపింది.