మిషిగన్, నవంబర్ 30: ఈ విశ్వంలో అనంత కోటి పాలపుంతలు.. వాటిల్లో కోట్లకొలది నక్షత్రాలు.. అందులో మన సూర్యుడొక నక్షత్రం. మన సౌర మండలంలో భూమిపై తప్ప ఏ గ్రహంపైనా ఇప్పటివరకూ జీవిని గుర్తించలేదు. ఏలియన్ల గురించి వింటున్నా, కండ్లతో చూసింది లేదు. ఇప్పటికైతే మనకు తెలిసి ఈ విశ్వంలో భూమిపై మాత్రమే జీవి మనుగడ సాగిస్తున్నది. దీనికి కారణం.. ఆక్సిజన్ ఉండటమే. విశ్వంలో ఏ గ్రహానికీ లేని ప్రాణవాయువు భూమికే ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 250 కోట్ల కిందటి దాకా భూమిపై కూడా ఆక్సిజన్ లేదు. మరి ఆ తర్వాతే ఎక్కడి నుంచి వచ్చింది? అంటే.. భూ అంతర్భాగంలో చోటుచేసుకొన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలికలే కారణమని శాస్త్రవేత్తలు తాజాగా తేల్చారు.
ఆక్సిజన్ ఎలా పుట్టిందంటే..
250-400 కోట్ల సంవత్సరాల మధ్య భూమి అంతా సముద్రమే. ప్రతి చోటా నీటితో నిండి ఉండేది. మీథేన్ పొగమంచుతో కప్పబడి ఉండేది. ఆ సమయానికి బహుకణాల జాడే లేదు. అయితే, 270 కోట్ల సంవత్సరాల క్రితం భూ అంతర్భాగంలో టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు ఏర్పడ్డాయి. దాంతో ఆక్సీకరణ చెందిన అవక్షేపాలు భూ ఉపరితలంపైకి తన్నుకొచ్చాయి. అప్పటికే భూ ఉపరితలంపై నీరు ఉండటంతో ఆ అవక్షేపాలు నీటితో కలిసి ఆక్సీకరణ చెందిన మాగ్మాలు ఏర్పడ్డాయి. అప్పుడే పెద్ద ఎత్తన ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యింది. ఆ తర్వాత కొన్నేండ్లకు లావాలు ఏర్పడటంతో ఆ ఆక్సిజన్ వాతావరణంలోకి చేరినట్టు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.