సియోల్: దక్షిణ కొరియాలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కేసు నమోదు అయ్యింది. దీన్నే నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఈ వ్యాధి సోకి ఆ దేశంలో 50 ఏళ్ల ఓ వ్యక్తి మరణించాడు. అయితే అతనికి థాయిలాండ్లో ఆ ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 10వ తేదీన ఆ వ్యక్తి కొరియా వచ్చాడు. అంతకుముందు నాలుగు నెలల పాటు ఆయన థాయ్లాండ్లో ఉన్నారు. ఈ ఇన్ఫెక్షన్ గురించి కొరియా వ్యాధుల నియంత్రణ ఏజెన్సీ పేర్కొన్నది.
నగలేరియా ఓ సూక్ష్మజీవి. ఇది ఏక కణ జీవి. సాధారణంగా నదుల్లో, చెరువులు, వాగుల్లోనూ ఈ రకమైన అమీబా ఉంటుంది. కానీ అన్నింటికీ ప్రాణాంతక శక్తి ఉండదు. కానీ నగలేరియా ఫ్లవరీ మాత్రం మనుషులకు సోకుతుంది. అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ ప్రకారం.. ముక్కు ద్వారా మనిషి శరీరంలోకి నగలేరియా ప్రవేశించి.. అది బ్రెయిన్కు చేరుతుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న నరాలను ఆ అమీబా దెబ్బతీస్తుంది. పీఏఎం అంటే ప్రైమరీ అమీబిక్ మెనింజోఇన్సెఫిలైటిస్ అనే వ్యాధికి కారణం అవుతుంది. ఇది ప్రాణాంతకమైన వ్యాధి. అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకుతుంటుంది.
పీఏఎం సోకినప్పుడు తల ముందు భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది. జ్వరం, వాంతులు, మెడ పట్టేయడం లాంటి ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. ఒకవేళ పరిస్థితి సీరియస్గా ఉంటే, అది మానసిక సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది. 1962 నుంచి 2021 వరకు అమెరికాలో 154 పీఏఎం కేసులు నమోదు అయ్యాయి. దీంట్లో కేవలం నలుగురు మాత్రమే బ్రతికినట్లు సీడీసీ వెల్లడించింది. నగలేరియా ఫ్లవరీ ఇన్ఫెక్షన్ మనుషుల నుంచి మనుషులకు సోకదు. ఈ వ్యాధి చికిత్స కోసం కొన్ని డ్రగ్స్ వాడుతుంటారు.