జెనీవా: ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ ( IPCC ) వాతావరణ మార్పులపై సమగ్రమైన శాస్త్రీయ సమాచారాన్ని సేకరిస్తున్నది. గతానికి చెందిన, భవిష్యత్తులో ఎదుర్యయే వాతావరణ ముప్పుల గురించి తన వద్ద నిక్షిప్తం చేస్తున్నది. అయితే గత ఏడేళ్లకు సంబంధించిన వాతావరణ డేటాను ఇవాళ ఐపీసీసీ రిలీజ్ చేసింది. శిలాజ ఇంధనాలతో భూగోళానికి ముప్పు ఉందని చెప్పిన ఆ నివేదికను సోమవారం రిలీజ్ చేశారు.
యునైటెడ్ నేషన్స్కు చెందిన వరల్డ్ మెటిరోలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో), ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ఈపీ)లు సంయుక్తంగా ఐపీసీసీని ఏర్పాటు చేశాయి. 1988లో ఐపీసీసీని ఏర్పాటు చేశారు. వాతావరణ మార్పుల్లో ఉన్న శాస్త్రీయతను అధ్యయనం చేసేందుకు ఈ ప్యానెల్ను నియమించారు. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా.. ప్రభుత్వాలు తమ అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తుంటాయి. గ్లోబల్ వార్మింగ్పై తటస్థ పద్ధతిలో, సైన్స్ ఆధారిత అప్డేట్స్ను ప్రజాప్రతినిధులకు తెలియజేస్తుంది. వాతావరణ మార్పుల్లో ఉండే సమస్యలు.. వాటిని అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఐపీసీసీ తన రిపోర్ట్లో చెబుతుంది.
ఐపీసీసీలో ప్రస్తుతం 195 సభ్యదేశాలు ఉన్నాయి. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉన్నది. ప్రస్తుతం దక్షిణ కొరియాకు చెందిన హీసంగ్ లీ దానికి బాధ్యతలు వహిస్తున్నారు. క్లైమేట్ ఛేంజ్ సబ్జెక్ట్లో ఆయన నిపుణుడు. ఐపీసీసీ తన నివేదికను తయారు చేసేందుకు.. వేల సంఖ్యలో వాతావరణ శాస్త్రవేత్తలను వాడుకుంటుంది. ఓషియనోగ్రాఫర్స్, ఐస్ స్పెషలిస్ట్స్, ఆర్థికవేత్తలు, పబ్లిక్ హెల్త్ నిపుణులు కూడా ఐపీసీసీ నివేదికలో భాగస్వాములవుతారు.
ఐపీసీసీ తన నివేదిక కోసం కొత్తగా ఎటువంటి అధ్యయనాలు చేపట్టదు. కానీ పబ్లిష్ అయిన వేలాది అధ్యయనాలను, శాస్త్రవేత్తలు కనుగొన్న వాటిని క్రోడీకరిస్తుంది. అన్ని అధ్యయనాలను సమీక్షించిన తన నివేదికను ఐపీసీసీ రూపొందిస్తుంది. ప్రతి ఆరేళ్లకు ఒకసారి రిపోర్ట్ ను తయారు చేస్తారు. 1990లో తొలిసారి నివేదిక ఇచ్చారు. 2014లో చివరిసారి రిపోర్ట్ సమర్పించారు. వాతారణ మార్పులపై మూడు బృందాలు నివేదికలను రూపొందిస్తాయి. ఒక్కొక్క గ్రూపుకు చెందిన రిపోర్ట్ను వేర్వేరుగా పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత చివరకు మూడింటిని కలిపి ఫైనల్ నివేదిక రిలీజ్ చేస్తారు.
ఫస్ట్ వర్కింగ్ గ్రూపుకు చెందిన నివేదికను ఆగస్టు 9న రిలీజ్ చేశారు. ఇక రెండవ గ్రూపు రిపోర్ట్ను ఫిబ్రవరి 2022న రిలీజ్ చేస్తారు. ఇక మూడవ గ్రూపు నివేదికను మార్చి 2022లో రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిపోర్ట్ కూడా వచ్చే ఏడాది ఉంటుంది. ఐపీసీసీ ఇచ్చే నివేదిక ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు కీలకం అవుతుంది. ఐపీసీసీ ఇచ్చే నివేదికలో ప్రభుత్వాలు కావాలంటే సవరణలు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తల రిపోర్ట్ను ప్రభుత్వాలు అంగీకరించే అవకాశాలు ఉన్నాయి. ఐపీసీసీలో ఉన్న సభ్యదేశాలు కావాలంటే.. ప్రత్యేక నివేదికలను సమర్పించవ్చు. అయితే భూగోళం 1.5 డిగ్రీల సెల్సియస్తో వేడెక్కుతున్నట్లు 2018, అక్టోబర్లో ఓ నివేదిక రిలీజైన విషయం తెలిసిందే.
2014లో ఐపీసీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే పారిస్ అగ్రిమెంట్ కుదిరింది.