కీవ్: నల్ల సముద్రంలో ఉన్న రష్యాకు చెందిన మిస్సైల్ క్రూయిజర్ మాస్క్వా యుద్ధ నౌకను నెప్ట్యూన్ మిస్సైళ్లతో పేల్చివేసినట్లు ఉక్రెయిన్ చెబుతోంది. నెప్ట్యూన్ మిస్సైళ్లను కీవ్కు చెందిన మిలిటరీ ఇంజినీర్లు డిజైన్ చేశారు. నల్ల సముద్రంలో రష్యా యుద్ధ నౌకలతో ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంజినీర్లు నెప్ట్యూన్ మిస్సైళ్లను డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. నెప్ట్యూన్ మిస్సైళ్ల రేంజ్ 300 కిలోమీటర్లు. గత ఏడాది మార్చిలో తొలిసారి ఆ క్షిపణులను ఉక్రెయిన్ తన అమ్ములపొదిలో చేర్చింది.
మాస్క్వా యుద్ధ నౌకను తమ క్షిపణితో పేల్చినట్లు ఉక్రెయిన్ చెబుతున్నా.. ఆ నౌకలో పేలుడు జరిగినట్లు రష్యా పేర్కొన్నది. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ప్రమాద సమయంలో సుమారు 500 మంది సిబ్బంది మాస్క్వా నౌకలో ఉన్నట్లు భావిస్తున్నారు. నెప్ట్యూన్ మిస్సైళ్ల పొడువు 5.05 మీటర్లు. బరువు 870 కేజీలు ఉంటుంది. నెప్ట్యూన్ను యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్గా పరిగణిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను మోసుకువెళ్లగలదు.
రష్యా ఆక్రమణ మొదలుపెట్టిన తర్వాత.. ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల నుంచి భారీ స్థాయిలో సైనిక ఆయుధాలు అందుతున్నాయి. యాంటీ ఎయిర్క్రాఫ్ట్, యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను బ్రిటన్ పంపిన విషయం తెలిసిందే. అయితే మాస్క్వా యుద్ధ నౌక మునుగుతున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించినా.. ఆ నౌకలో చెలరేగిన మంటల్ని ఆర్పినట్లు రష్యా చెబుతోంది. ఒకవేళ మాస్క్వా సముద్రంలో మునిగిపోతే, అది ఉక్రెయిన్కు నైతిక విజయమే అవుతుంది.