గుర్తించిన నాసా పరిశోధకులు
జీవం ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా
వాషింగ్టన్, జూలై 27: బృహస్పతి ఉపగ్రహమైన గనిమీడ్ వాతావరణంలో నీటిఆవిరి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆధారాలతో సహా కనుగొన్నారు. నాసాకు చెందిన హబుల్ స్పేస్ టెలీస్కోప్ 1998 నుంచి పంపించిన ఫొటోలను విశ్లేషించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్టు తెలిపారు. గనిమీడ్పై మంచు గడ్డకట్టి ఉంటుంది. వందల కిలోమీటర్ల మందంతో ఈ మంచు ఫలకాలు పేరుకుపోయి ఉంటాయని, దాని కిందనే నీరు ఉండవచ్చని అంచనా. దీంతో నీటి ఆవిరి వాతావరణంలోకి విడుదలయ్యే పరిస్థితి ఉండదు. అయితే, గనిమీడ్ భూమధ్య రేఖ ప్రాంతంలో ఉండే ఎక్కువ ఉష్ణోగ్రతల కారణంగా అత్యంత తక్కువ మోతాదులో మంచు కరిగి నీరుగా మారిందని, అలా ఆ అణువులు వాతావరణంలో నీటి ఆవిరిగా మారినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర కుటుంబంలో అత్యంత పెద్ద ఉపగ్రహమైన గనిమీడ్పై బ్రహ్మండమైన మంచు పేరుకుపోయి ఉన్నది. భూమి మీదనున్న మహాసముద్రాల నీటితో పోల్చితే, ఈ మంచును కరిగించడం ద్వారా ఉత్పత్తి అయ్యే నీరు చాలా ఎక్కువగా ఉంటుంది. గనిమీడ్ వాతావరణంలో నీటి ఆవిరిని గుర్తించిన నేపథ్యంలో ఆక్కడ జీవం ఉనికి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.